Thyronorm recall | హైదరాబాద్, ఏప్రిల్ 26: తెలంగాణ, మధ్యప్రదేశ్ రాష్ర్టాల్లో థైరోనార్మ్ ట్యాబ్లెట్లను అబ్బోట్ ఇండియా ఫార్మా రీకాల్ చేస్తున్నది. AEJ0713 అనే నెంబర్ కలిగిన థైరోనార్మ్ ట్యాబ్లెట్ బ్యాచ్లో లేబుల్ తప్పిదాన్ని గుర్తించడంతో కంపెనీ స్వచ్చందంగా రీకాల్ ప్రకటించింది. ఈ రెండు రాష్ర్టాల్లోని పంపిణీదారులకు ఇప్పటికే ఈ సమాచారాన్ని చేరవేశామని, వారితో కలిసి పనిచేస్తున్నామని సంస్థ తెలియజేసింది. 88mcg ట్యాబ్లెట్లున్న బాటిల్స్పై 25mcg లేబుల్ ఉందని అబ్బోట్ ఓ తాజా బహిరంగ ప్రకటనలో పేర్కొన్నది. వీటిపై తయారీ తేదీ మార్చి 2023, ఎక్స్పైరీ డేట్ ఫిబ్రవరి 2025గా ఉంటుందని అందులో వివరించింది.
కాబట్టి ఇటీవల థైరోనార్మ్ ట్యాబ్లెట్లను ఎవరైనా కొన్నైట్టెతే చెక్ చేసుకోవాలని, ఈ వివరాలతో కూడినవైతే.. తిరిగి వాటిని ఆయా దుకాణదారులకు ఇచ్చేయాలని కస్టమర్లకు అబ్బోట్ ఫార్మా విజ్ఞప్తి చేసింది. అలాగే ఈ ట్యాబ్లెట్ల అమ్మకాలకు సంబంధించిన బిల్లుల్లో ఉన్న పేషెంట్ల మొబైల్ నంబర్లకు ఫోన్, మెసేజ్లు పెట్టాలని దుకాణదారులకు సూచించాలని కూడా డిస్ట్రిబ్యూటర్లకు అబ్బోట్ చెప్తున్నది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ డ్రగ్స్ కంట్రోల్ విభాగం సైతం అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డ్రగ్ ఇన్స్పెక్టర్లను రంగంలోకి దించి లోపాలతో కూడిన బ్యాచ్ నెంబర్ ట్యాబ్లెట్ల అమ్మకాలు ఆగేలా చేస్తున్నది. కాగా, మోతాదు చాలా ఎక్కువ (63mcg)గా ఉన్నందున ఈ ట్యాబ్లెట్లను వాడిన రోగులకు తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చని వైద్య నిపుణులు అంటున్నారు. థైరోనార్మ్ ట్యాబ్లెట్లను హైపోథైరాయిడిజం చికిత్సకు వాడుతారన్న విషయం తెలిసిందే.