Small Savings | ప్రతి ఒక్కరూ తమ పిల్లల భవితవ్యంపై తమ ఆదాయంలో కొంత మొత్తం పొదుపు చేస్తుంటారు. అలా పొదుపు చేసే పథకాల్లో పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ (పీపీఎఫ్), సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్వై)తోపాటు పోస్టాఫీసు డిజిటల్ పథకాలు, చిన్న మొత్తాల పొదుపు పథకాలు (Small Saving Schemes) ఉన్నాయి. వాటిల్లో నిధులు పొదుపు చేసే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆధార్ సమర్పించాలని కేంద్రం తెలిపింది. ఈ మేరకు గత మార్చి 31న నోటిఫికేషన్ జారీ చేసింది కేంద్ర ఆర్థిక శాఖ.
అయితే, పీపీఎఫ్, ఎస్ఎస్వై, ఎన్ఎస్సీ, ఎస్సీఎస్ఎస్ వంటి చిన్న మొత్తాల పథకాల్లో నిధులు పొదుపు చేస్తూ అకౌంట్ ప్రారంభించిన వారు ఆధార్ సమర్పించలేదు. అటువంటి వారంతా ఈ నెలాఖరు లోగా ఆధార్ తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. ఏ కారణం చేతనైనా సమర్పించకపోతే వచ్చే నెల ఒకటో తేదీ నుంచి సదరు స్మాల్ సేవింగ్ స్కీమ్స్ ఖాతాలు స్తంభించి పోతాయి. కొత్తగా ఈ పథకాల్లో ఖాతాలు తెరిచే వారు ఆరు నెలల్లో ఆధార్ వివరాలు తెలియజేయాల్సిందే. లేకుంటే వారి ఖాతాలూ పని చేయవు.
పోస్టాఫీసులో చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో నిధులు మదుపు చేసిన వారు వెంటనే ‘కేవైసీ’ ప్రక్రియ పూర్తి చేయాలని గత మే నెలలోనే ఇండియా పోస్ట్ తన అకౌంట్ హోల్డర్లకు నోటీసులు జారీ చేసింది. సంబంధిత ఖాతాల్లో రూ.50 వేల డిపాజిట్ దాటినా, ఒక ఆర్థిక సంవత్సర డిపాజిట్లు రూ.లక్ష దాటినా, ఒక నెలలో ట్రాన్స్ఫర్ లేదా విత్డ్రాయల్ మొత్తం రూ.10 వేలు దాటినా.. రెండు నెలల్లో పాన్ కార్డు సమర్పించాలి. లేని పక్షంలో వారి ఖాతాలు స్తంభించిపోయే ముప్పు ఉందని హెచ్చరికలు జారీ చేసింది.