Pan Card | న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: ఇక నుంచి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), సుకన్య సమృద్ధి యోజన, పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీమ్, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ తదితర చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో మదుపు చేసేందుకు పాన్, ఆధార్ నంబర్లను సమర్పించడం తప్పనిసరి. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటివరకూ ఆధార్ నంబర్ లేకుండానే చిన్న పొదుపు స్కీమ్ల్లో పెట్టుబడి చేసే వీలు ఉండేది. ఇక నుంచి ఆధార్తో పాటు నిర్దేశిత పరిమితికి మించి చేసే పెట్టుబడికి పాన్ నంబర్ సమర్పించడం కూడా తప్పనిసరి. ఇప్పటికే వివిధ పోస్టాఫీస్ పొదుపు ఖాతాల్ని కలిగినవారు ఆధార్ నంబర్ను సమర్పించడానికి 2023 సెప్టెంబర్ 23 గడువు తేదీగా ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే కొత్తగా ఖాతాలు తీసుకునేవారు ఖాతా తెరిచిన తేదీ నుంచి ఆరు నెలల లోపు ఆధార్ను ఇవ్వాలి. ఆరు నెలల లోగా ఆధార్ నంబర్ లేదా ఆధార్ ఎన్రోల్మెంట్ నంబర్ను జతచేయకపోతే సంబంధిత చిన్న మొత్తాల పొదుపు ఖాతాను స్తంభింప చేస్తారు. ప్రస్తుత చందాదారులు ఆధార్ను సమర్పించకపోతే 2023 అక్టోబర్ 1 నుంచి ఖాతా ఫ్రీజ్ అవుతుంది.