బహుళ ప్రాచుర్యం పొందిన రెండు పోస్టాఫీసు పథకాలకు సంబంధించి కేంద్ర బడ్జెట్లో ప్రతిపాదించిన మార్పులు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చాయి. అంతేకాకుండా మహిళల కోసం ఒక కొత్త పథకాన్ని సైతం ప్రవేశపెట్టారు. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీం (ఎస్సీఎస్ఎస్), పోస్టాఫీస్ మంథ్లీ ఇన్కం స్కీం (పీఓఎంఐఎస్)లలో జరిగిన మార్పులివే..
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీం
ఈ స్కీంలో పెట్టుబడి పరిమితిని ఏప్రిల్ 1 నుంచి రూ.15 లక్షల నుంచి రూ. 30 లక్షల వరకూ పెంచారు. పదవీ విరమణ తర్వాత వయో వృద్దులకు గ్యారంటీ అదాయాన్ని సమకూర్చే లక్ష్యంతో మొదలైన ఎస్సీఎస్ఎస్ ద్వారా ప్రస్తుత ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి 8.2 శాతం వడ్డీని నిర్ణయించారు. ఇది ఐదేండ్లకు ఫిక్స్డ్ డిపాజిట్. కనీసం రూ.1,000 నుంచి ఆపై రూ.1,000 గుణిజాల్లో మదుపు చేయవచ్చు. ప్రస్తుతం ఈ స్కీమ్లో గరిష్ఠంగా రూ.15 లక్షల వరకూ పెట్టుబడి చేసేందుకు మాత్రమే అనుమతి ఉండగా, దీనిలో ఏప్రిల్ 1 నుంచి రూ.30 లక్షల వరకూ పెట్టుబడి చేసుకోవచ్చు. అయితే దీనిపై వచ్చే వడ్డీపై ఆదాయపు పన్ను ఉంటుంది.
పోస్టాఫీస్ మంథ్లీ ఇన్కం స్కీం
ఈ స్కీంలో ఒక వ్యక్తి మదుపు చేసుకునే పరిమితిని రూ.4 లక్షల నుంచి రూ. 9 లక్షలకు పెంచారు. జాయింట్ ఖాతాలో చేసే పెట్టుబడి పరిమితిని రూ.9 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంచారు. ఈ పెంపు 2023 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తుంది. ఈ స్కీంలో మదుపు చేసినవారికి నెలవారీ వడ్డీ అందుతుంది. వడ్డీ రేటును ఎప్పటికప్పుడు ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ప్రస్తుత ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో దీనిపై 7.4 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నారు. ఈ మంథ్లీ ఖాతా కాలపరిమితి ఐదేండ్లు. ఖాతా ప్రారంభించిన మూడేండ్ల తర్వాత ఐదేండ్లలోపు కూడా ఖాతాను మూసివేసుకోవచ్చు. అయితే ముంద స్తుగా క్లోజ్ చేస్తే అసలు మొత్తంపై 1 శాతం పెనాల్టీ పడుతుంది.
మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్
మహిళల కోసం ప్రత్యేకంగా బడ్జెట్లో ప్రకటించిన ఈ సర్టిఫికెట్ రెండేండ్ల స్వల్పకాలానికి ఉద్దేశించిన పొదుపు పథకం.తాజాగా ప్రారంభమైన ఈ స్కీం వివరాల్ని మార్చి 31న ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా తెలియపర్చింది. మహిళలు, బాలికల పేరిట రెండేండ్ల కాలానికి కనీస పెట్టుబడి రూ.10,000కాగా, అటుపై రూ.100 గుణిజాల్లో రూ. 2 లక్షల వరకూ ఈ సర్టిఫికెట్ ద్వారా మదుపు చేసుకోవచ్చు. 7.5 శాతం ఫిక్స్డ్ వడ్డీ రేటుతో ఇది లభిస్తుంది. త్రైమాసికానికోసారి వడ్డీని గణించి ఖాతాలో జమచేస్తారు. డిపాజిట్ మొత్తంలో కొంత భాగాన్ని మధ్యలో తీసుకునే సదుపాయం కూడా ఉంది. మహిళా సమ్మాన్ సేవింగ్స్ ఖాతాను స్వయంగా మహిళ లేదా మైనర్ బాలిక తరపున గార్టియన్ తెరవవచ్చు. 2025 మార్చి 31లోగా ఎప్పుడైనా ఈ సర్టిఫికెట్లో మదుపు చేయవచ్చు. డిపాజిట్ చేసిన తేదీ నుంచి రెండేండ్లలో దీని కాలపరిమితి ముగుస్తుంది. ఖాతా ప్రారంభించిన తేదీ నుంచి ఒక ఏడాది తర్వాత…కాలపరిమితి ముగియకముందు 40 శాతం బ్యాలెన్స్ను తీసుకునే సదుపాయం ఉంది.