Telangana | న్యూఢిల్లీ, జూలై 29: మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్తో కలిసి తేద్దామనుకున్న జాయింట్ వెంచర్ ఆలోచనను చైనా ఆటో రంగ దిగ్గజం బీవైడీ విరమించుకున్నది. భద్రతా కారణాలను చూపుతూ కేంద్ర ప్రభుత్వం ఈ వెంచర్కు అనుమతులు నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇరు సంస్థల మధ్య జరిగిన చర్చల్లో పెట్టుబడులు పెట్టబోమని, ఆ ప్రణాళికల నుంచి వైదొలగాలనుకుంటున్నట్టు మేఘాకు బీవైడీ తేల్చిచెప్పినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. తెలంగాణలో విద్యుత్తు ఆధారిత (ఈవీ) కార్ల తయారీ పరిశ్రమను పెద్ద ఎత్తున తేవాలని బీవైడీ, మేఘా చేతులు కలిపిన విషయం తెలిసిందే. ఇందుకు అనుమతివ్వాలంటూ కేంద్రానికి దరఖాస్తు పెట్టుకున్న సంగతీ విదితమే. కానీ మోదీ సర్కారు మొండిచెయ్యే చూపింది. ఫలితంగా రాష్ర్టానికి బీవైడీ నుంచి రూ.8,200 కోట్ల విదేశీ పెట్టుబడులు దూరమైనైట్టెంది. అంతేగాక ఈవీ ప్లాంట్ నిలిచిపోయి వేలాది ఉద్యోగ, ఉపాధి అవకాశాలూ గల్లంతయ్యాయి. అంతా సవ్యంగా జరిగితే రాష్ట్రంలో 2025లో ఈవీల తయారీని బీవైడీ-మేఘా చేపట్టేవి.
వాస్తవానికి ప్రస్తుతం దేశీయంగా అమ్ముతున్న బీవైడీ ఎలక్ట్రిక్ కార్లు.. భారత్లోనే తయారవుతున్నాయి. ఈ కార్లలోని యాప్స్ కోసం ఉన్న వాయిస్-యాక్టివేటెడ్ కమాండ్స్ కూడా భారతీయ భాషల్లోనే ఉంటున్నాయి. డాటా మొత్తం కూడా భారత్ కేంద్రంగానే ఉన్నది. అయినప్పటికీ భద్రతాపరమైన కారణాలను చూపడం సరికాదని కేంద్రం వ్యవహార శైలిపట్ల ఇప్పుడు సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చైనాతో సరిహద్దు ఘర్షణల నేపథ్యంలో 2020 నుంచి ఆ దేశ పెట్టుబడులపై భారత్ నిఘా పెంచింది. అన్ని రకాల అనుమతులు ఉంటే తప్ప చైనా కంపెనీలు భారత్లో పెట్టుబడులు పెట్టరాదని కేంద్రం నిర్ణయించింది. కాగా, 2007లోనే బీవైడీ భారతీయ మార్కెట్లోకి ప్రవేశించింది. 2013లో మేఘాతో కలిసి ఎలక్ట్రిక్ బస్సుల తయారీకి కూడా దిగింది. మేఘాకు చెందిన ఒలెక్ట్రా గ్రీన్టెక్ ఎలక్ట్రిక్ బస్సులు బీవైడీ సహకారంతో వచ్చినవే. ఇక ఇప్పటికే దేశంలో 200 మిలియన్ డాలర్లకుపైగా పెట్టుబడులు పెట్టిన బీవైడీ.. ఆయా మోడల్స్ కార్లనూ విక్రయిస్తున్నది. చైనా నుంచి కొన్ని విడిభాగాలను దిగుమతి చేసుకుని, ఇక్కడ కార్లను తయారు చేస్తున్నది. కేంద్రం గణాంకాల ప్రకారం గత ఏడాది నుంచి ఇప్పటిదాకా 1,950 కార్లను అమ్మింది. బీవైడీ.. భారత్లో బ్యాటరీలను, మొబైల్ ఫోన్ విడిభాగాలనూ తయారు చేస్తుండటం విశేషం.
నిజానికి పెట్టుబడుల ప్రతిపాదనను ఇప్పుడే ఉపసంహరించుకోవద్దని, కొంతకాలం వేచిచూద్దామని బీవైడీకి మేఘా చెప్పిందంటున్నారు. కానీ కేంద్రం తీరును చూసిన చైనా కంపెనీ.. ఆగినా ఫలితం ఉండదని వెనక్కిపోవడానికే నిర్ణయించుకున్నట్టు తెలుస్తున్నది. ఈ వ్యవహారాన్ని మోదీ సర్కారు రాజకీయ కోణంలో చూస్తున్నదని, కాబట్టి తమ జాయింట్ వెంచర్కు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి రాదన్న అభిప్రాయానికి బీవైడీ వర్గాలు వచ్చినట్టు చెప్తున్నారు. మొదట్నుంచీ తెలంగాణ ప్రభుత్వంతో కయ్యానికి కాలు దువ్వుతున్న మోదీ సర్కారు.. ఇప్పుడీ జాయింట్ వెంచర్కు కావాలనే గుడ్డిగా నో చెప్పిందన్న గుసగుసలూ వినిపిస్తున్నాయి.