న్యూఢిల్లీ, జనవరి 12: ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే మూలధన వ్యయాల (క్యాపెక్స్)పై గత మూడేండ్లుగా చూపిస్తున్న జోరును వచ్చే ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం బాగా తగ్గించుకుంటుందని అంచనా వేస్తున్నారు. మౌలిక ప్రాజెక్టుల్లో పెట్టుబడుల్ని పెంచడం ద్వారా ఉపాధి కల్పన, ఆర్థిక వ్యవస్థకు ఉద్దీపన కలిగించేందుకు ఉద్దేశించిన ఈ మూలధన వ్యయాల్ని గత మూడేండ్లుగా కేంద్రం 30 శాతం చొప్పున పెంచుతూ వచ్చింది. అయితే 2024-25లో ఈ పెంపుదల 10 శాతానికి పడిపోతుందని గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ గోల్డ్మాన్ శాక్స్ తెలిపింది.
ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న మధ్యంతర బడ్జెట్పై రిపోర్ట్ విడుదల చేసింది. మూడేండ్లుగా బడ్జెట్లో క్యాపెక్స్కు జీడీపీలో 3.3 శాతం చొప్పున కేటాయింపులు జరుపుతున్నారని, అయితే ద్రవ్యలోటును 5.2-5.4 శాతానికి అదుపుచేయాలన్న లక్ష్యంతో 2024-25లో మూలధన వ్యయాల్లో పెంపుదల 10 శాతానికే పరిమితమవుతుందని ఎకానమిస్టులు అంచనా వేస్తున్నారు. 5.9 శాతం నిర్దేశిత ద్రవ్యలోటు లక్ష్యాన్ని ప్రభుత్వం సాధించవచ్చని తెలిపారు. 2023-24లో సబ్సిడీలపై వ్యయాలు జీడీపీలో 1.6 శాతంకాగా, 2024-25లో ఇవి 1.4 శాతానికి దిగివస్తాయని పేర్కొన్నారు. కానీ సహజవాయువు ధరలు పెరిగిందున ఎరువులపై సబ్సిడీ భాగం పెరగవచ్చని అంచనా వేశారు.