న్యూఢిల్లీ, జనవరి 26: ప్రధాని నరేంద్ర మోది సన్నిహిత మిత్రుడిగా పేరొందిన దేశీ శ్రీమంతుడు గౌతమ్ అదానీ వ్యాపార సామ్రాజ్యంపై అమెరికా హెడ్జ్ ఫండ్ హిండెన్బర్గ్ చేసిన తీవ్ర ఆరోపణల నేపథ్యంలో అంతర్జాతీయంగా అదానీ గ్రూప్ ప్రతిష్ఠ దిగజారిందని, ప్రపంచ మార్కెట్లలో ఈ గ్రూప్ పెట్టుబడులు సమీకరించడం కష్టసాధ్యం అవుతుందని ప్రసిద్ధ గ్లోబల్ వార్తా సంస్థ బ్లూంబర్గ్ వ్యాఖ్యానించింది. అదానీ గ్రూప్ అవకతవకలపై హిండెన్బర్గ్ విడుదల చేసిన నివేదిక కార్పొరేట్ ప్రపంచంలో, మార్కెట్లలో పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఒకే రోజులో అదానీ గ్రూప్ ఇన్వెస్టర్ల పెట్టుబడులు 11 బిలియన్ డాలర్ల మేర కరిగిపోవడాన్ని తాజాగా బ్లూంబర్గ్ ప్రస్తావిస్తూ ఒక కథనం ప్రచురించింది.
ఇజ్రాయిల్ నుంచి మొరాకో వరకూ పలు దేశాల్లో విస్తరణ ప్రణాళికల్ని ప్రకటించిన తరుణంలోనే ఈ రిపోర్ట్తో గౌతమ్ అదానీ అనుకున్నట్టు సానుకూలంగా కాకుం డా ఈ గ్రూప్పై అంతర్జాతీయ దృష్టి ప్రతికూలంగా మారిందన్నది. అదానీ ఎంటర్ప్రైజెస్ 2.5 బిలియన్ డాలర్ల (రూ.20,000 కోట్లు) ఫాలో ఆన్ ఆఫర్ (ఎఫ్పీవో)లో భాగంగా సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్లను విక్రయించే రోజునే విడుదలైన హిండన్బర్గ్ రిపోర్ట్లో చేసిన ఆరోపణలు అదానీ గ్రూప్ గ్లోబల్ విస్తరణను దెబ్బతీస్తాయని బ్లూంబర్గ్ పేర్కొంది. వ్యాపార విస్తరణకు గౌతమ్ అదానీ కోరుకుంటున్న అంతర్జాతీయ ఇన్వెస్టర్లు హిండన్బర్గ్ రిపోర్ట్తో వెనక్కు తగ్గుతారన్నది.
ఇండియాలోనైతే మేనేజ్ చేసుకునేవారే
ఈ స్థాయి స్క్రూటినీని (హిండన్బర్గ్ రిపోర్ట్) అదానీ తన స్వదేశం ఇండియాలోనైతే చాలావరకూ మేనేజ్చేసుకునేవారని బ్లూంబర్గ్ పేర్కొంది. భారత్లో అదానీపై విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సన్నిహితత్వం కారణంగా అవేవీ కూడా ఆయన అపార వృద్ధికి అడ్డంకి కాలేదని తెలిపింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారవచ్చన్నది. హిండన్బర్గ్ ఒక చిన్న షార్ట్సెల్లింగ్ సంస్థ కావొచ్చని, అమెరికా ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ నికోలా కార్పొరేషన్ వంటి కంపెనీలను దించివేసిన చరిత్ర ఉందని వార్తా సంస్థ తెలిపింది. 2020 నుంచి హిండన్బర్గ్ 30 కంపెనీలను టార్గెట్ చేయగా, ఆయా షేర్లు ఆ మరుసటి రోజే 15 శాతం వరకూ పతనమయ్యాయి.
ఆరు నెలల తర్వాత ఆ షేర్లు సగటున 26 శాతం క్షీణించాయి. హిండన్బర్గ్ సామర్థ్యాన్ని ఇప్పటికే చూసిఉన్నందున, అదానీ గ్రూప్పై చేసిన ఆరోపణలు పూర్తిగా పరిశోధించినవేనని భావిస్తున్నట్టు జర్మనీ అసెట్ మేనేజ్మెంట్ సంస్థ ఎంపీపీఎం జీఎంబీహెచ్ ట్రేడింగ్ హెడ్ గిల్లెర్మో సాంప్రే చెప్పారు. హిండెన్బర్గ్ వివరణాత్మకంగా రూపొందించిన పరిశోధనా నివేదిక బహిరంగమైనందున, భారత ప్రభుత్వం అందులో ఆరోపణల్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని బ్లూంబర్గ్ తెలిపింది. ‘నువ్వు శ్రీమంతుడివయ్యావంటే ప్రశ్నలు ఎదురవుతాయి.
ఈ కంపెనీలకు అంత విలువ ఎందుకంటూ ప్రశ్నిస్తారు’ అని బెంగళూరుకు చెందిన వెల్త్ మేనేజ్మెంట్ సంస్థ క్యాపిటల్మైండ్ సీఈవో దీపక్ షెనాయ్ అన్నారు. గత ఏడాది ఆగస్టులో అంతర్జాతీయ డెట్ రీసెర్చ్ సంస్థ క్రెడిట్సైట్స్ అదానీ గ్రూప్ తీసుకున్న భారీ రుణాల్ని ప్రశ్నించింది. కానీ అదానీ రుణ నిష్పత్తులు సబబుగానే ఉన్నాయంటూ నెలరోజుల తర్వాత క్రెడిట్సైట్స్ వివరణ ఇచ్చింది. అయితే హిండన్బర్గ్ చేసిన ఆరోపణలు భిన్నమైనవి. ఖాతా పుస్తకాల్లో నకిలీ లెక్కలు చూపించారని, విదేశాల్లో డొల్లకంపెనీలు ఏర్పాటుచేసి, మనీ లాండరింగ్ పాల్పడ్డారని, కృత్రిమంగా షేర్ల ధరల్ని పెంచివేసి, వాటిపై రుణాలు తీసుకున్నారంటూ విరుచుకుపడింది. క్రెడిట్సైట్స్లా హిండెన్బర్గ్ వెనక్కుతగ్గదు…ఇది 60 ఏండ్ల అదానీకి పెద్ద సవాలని బ్లూంబర్గ్ పేర్కొంది.
లాసూట్ వేస్తే డాక్యుమెంట్లు డిమాండ్ చేస్తాం: హిండెన్బర్గ్
అదానీ గ్రూప్పై అమెరికా హెడ్జ్ ఫండ్ హిండెన్బర్గ్ చేసిన తీవ్ర ఆరోపణల నేపథ్యంలో ఇరు పక్షాలు గురువారం ఘాటుగా స్పందించాయి. హిండన్బర్గ్ రీసెర్చ్ తగిన పరిశోధన చేయకుండా, దురుద్దేశ్యపూర్వకంగా నివేదిక విడుదల చేసిందని, అమెరికా, ఇండియా చట్టాలను అనుసరించి లీగల్ చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నామంటూ అదానీ గ్రూప్ లీగల్ హెడ్ జతిన్ జలుండ్వాలా ప్రకటన జారీచేశారు. అదానీ ప్రకటన వెలువడిన కొద్దిగంటలకే హిండన్బర్గ్ స్పందిస్తూ లీగల్ చర్యల్ని ఆహ్వానిస్తున్నామని, తమ నివేదికకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని, తాము కార్యకలాపాలు నిర్వహించే యూఎస్లో లాసూట్ దాఖలు చేసుకోవొచ్చన్నది.
లాసూట్ వేస్తే లీగల్ ప్రక్రియకు అవసరమైన కంపెనీ డాక్యుమెంట్లను డిమాండ్ చేస్తామని హిండన్బర్గ్ పేర్కొంది. నివేదిక విడుదల చేసి 36 గంటలైనప్పటికీ, తాము లేవనెత్తిన ఏ ఒక్క అంశంపై అదానీ స్పందించలేదని, కంపెనీ పారదర్శకంగా వ్యవహరిస్తుందన్న ఉద్దేశ్యంతో నివేదిక ముగింపులో నేరుగా 88 ప్రశ్నలను అడిగామని, వీటిలో దేనికీ సమాధానం ఇవ్వలేదని అమెరికా సంస్థ విమర్శించింది. రెండేండ్లపాటు పరిశోధించి తాము రూపొందించిన 106 పేజీలు, 32,000 పదాలు, 720 రిఫరెన్స్లతో కూడిన రిపోర్ట్ను ‘పరిశోధించనది’గా అదానీ పేర్కొంటూ తాము అంచనా వేసినట్టుగానే బెదిరింపులకు దిగుతున్నదని హిండన్బర్గ్ వివరించింది.