న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న సువెన్ ఫార్మాస్యూటికల్స్కు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. సంస్థలోకి వచ్చిన రూ.9,589 కోట్ల విలువైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ పచ్చజెండా ఊపింది. సైప్రస్కు చెందిన బెర్హ్యాండా ఈ భారీ పెట్టుబడులు పెట్టబోతున్నది. దీంతో సువెన్ ఫార్మాస్యూటికల్స్లో బెర్హ్యాండా 76.1 శాతం వాటా కలిగివుండనున్నది. ఈ వాటాకు సంబంధించి ప్రమోటర్లు, పబ్లిక్ షేరు హోల్డర్లు తమ వాటాను బెర్హ్యాండాకు బదలాయించాల్సి ఉంటుంది. ఈ వాటా కొనుగోలు ప్రతిపాదనకు ఇప్పటికే సెబీ, ఆర్బీఐ, సీసీఐ, ఇతర ఏజెన్సీలు అనుమతినిచ్చాయి. మరోవైపు, గడిచిన ఐదేండ్లకాలంలో ఫార్మా రంగంలోకి రూ.43,713 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి.