Personal Finance | చరిత్ర కాల గర్భంలో సెప్టెంబర్ కలిసిపోయింది. కానీ, కొన్ని విభాగాలు, మరికొన్ని మంత్రిత్వశాఖలు.. ఇంకొన్ని సంస్థలు కీలక అంశాలపై గడువు పొడిగించాయి. మరి కొన్ని పథకాల గడువు ముగించాయి. ప్రతి ఆర్థిక లావాదేవీకి నామినీని తప్పనిసరిగా మారింది. కొన్ని ప్రజాదరణ గల పథకాల గడువును పొడిగించారు.. వాటి గురించి తెలుసుకుందాం..
దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులకు నిర్వహించే డీమ్యాట్ ఖాతా దారులు.. తమ ఖాతాలకు నామినీలను నామినేట్ చేయాలని స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ ‘సెబీ’ ఆదేశించింది. ఇంతకుముందు సెప్టెంబర్ నెలాఖరుతో ముగిసినా.. మళ్లీ డిసెంబర్ వరకూ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. షేర్లు కలిగి ఉ్న వారు పాన్, నామినీ నామినేషన్, బ్యాంక్ ఖాతా వివరాలు తెలియజేయడానికి డిసెంబర్ నెలాఖరు వరకూ గడువు పొడిగించింది.
మ్యూచువల్ ఫండ్స్లో మనీ పొదుపు చేసిన వారు తప్పనిసరిగా తమ నామినీలను నామినేట్ చేయాలని సెబీ ఇంతకుముందు ఆదేశించింది. 2023 మార్చి నెలాఖరు వరకూ గల గడువును తర్వాత సెప్టెంబర్ నెలాఖరు వరకూ పొడిగించింది. తాజాగా అక్టోబర్ ఒకటో తేదీ నుంచి 2024 జనవరి ఒకటో తేదీ వరకూ పొడిగించింది.
అమృత్ మహోత్సవ్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీం కింద ఐడీబీఐ ‘375 రోజుల పథకం’ తెచ్చింది. ఈ పథకంపై 7.10 శాతం వడ్డీరేటు ఆఫర్ చేసింది. సాధారణ పౌరులు, ఎన్నారైలు, ఎన్నార్వోలకు 7.10 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.60 శాతం వడ్డీరేటు ఆఫర్ చేసింది. ఇక 444 రోజుల అమృత్ మహోత్సవ్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీం కింద సాధారణ పౌరులకు 7.15 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.65 శాతం వడ్డీ ఆఫర్ చేస్తున్నది. ఈ పథకం గడువు అక్టోబర్ 31 వరకూ పొడిగించింది.
క్లీన్ నోట్ పాలసీ కింద రూ.2000 విలువైన నోటును బ్యాంకులో డిపాజిట్ చేయడానికి ఈ నెల ఏడో తేదీ వరకూ ఆర్బీఐ గడువు పొడిగించింది. ఇంతకుముందు సెప్టెంబర్ 30తో ముగిసింది. నిర్ధిష్ట గడువు ముగిసిన తర్వాత నిర్వహించిన సమీక్షలో రూ.2000 నోటు డిపాజిట్ లేదా మార్పిడి గడువు అక్టోబర్ ఏడో తేదీ వరకూ పొడిగించింది.
సీనియర్ సిటిజన్లకు ఐదేండ్ల గడువు గల స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ పథకం ‘వుయ్ కేర్’ 7.50 శాతం వడ్డీతో గతేడాది ఎస్బీఐ ప్రారంభించింది. ఈ పథకం గడువు సెప్టెంబర్ 30తో ముగిసింది.
మైనర్ల పేరిట నిర్వహించే చిన్న మొత్తాల పొదుపు పథకాలకు మీరు తప్పనిసరిగా ఆధార్ నంబర్ అనుసంధానించాల్సిందే. ఈ జాబితాలో నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్ఎస్సీ), పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ (పీపీఎఫ్) తదితర పథకాలు ఉన్నాయి. ఈ పథకాల్లో మదుపు చేసిన వారు తమ ఆధార్ నంబర్ అనుసంధానించడానికి సెప్టెంబర్ 30తో గడువు ముగిసింది.
సింగిల్ ప్రీమియంతో పాలసీ ‘ధనవృద్ధి’ పేరుతో భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) తెచ్చిన జీవిత బీమా పాలసీ గడువు సెప్టెంబర్ 30తో ముగిసింది. ఈ పాలసీ నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, సింగిల్ ప్రీమియం లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఇది రక్షణతోపాటు పొదుపు ఆఫర్ చేస్తుంది.
విదేశాల్లో పర్యటనల ఖర్చులపై టీసీఎస్ విధిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకున్నది. ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రతి ఒక్కరి విదేశీ పర్యటన ఖర్చు రూ.7 లక్షల వరకూ ఉంటే ఐదు శాతం టీసీఎస్ విధిస్తారు. ఈ టీసీఎస్ రూల్ అక్టోబర్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. విదేశీ పర్యటనల ఖర్చుకు అనుగుణంగా మీ బ్యాంకు ఖాతా నుంచి టీసీఎస్ డిడక్ట్ అవుతుంది.
ఆదాయం పన్ను చట్టం-1961 లోని 44ఏబీ సెక్షన్ ప్రకారం ప్రతి పన్ను చెల్లింపుదారుడు ఇన్ కం టాక్స్ అడిట్ రిపోర్ట్ పంపాలి. సెప్టెంబర్ 30లోపు ఆ అడిట్ రిపోర్ట్ పంపాలి. లేని పక్షంలో భారీగా పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది.