ముంబై, అక్టోబర్ 21: ప్రపంచంలోకెల్లా అత్యధిక విలువతో ట్రేడవుతున్న భారత మార్కెట్లో లాభాల స్వీకరణ కొనసాగడంతో స్టాక్ సూచీలు వరుసగా మూడోరోజూ తగ్గాయి. గురువారం ఒక దశలో బీఎస్ఈ సెన్సెక్స్ 800 పాయింట్ల వరకూ పతనమై 60,500 స్థాయి దిగువకు పడిపోయింది. ముగింపులో కొంతవరకూ కోలుకున్నప్పటికీ, క్రితంరోజుతో పోలిస్తే 336 పాయింట్ల నష్టంతో 60,923 పాయింట్ల వద్ద ముగిసింది. మూడు రోజుల్లో ఈ సూచి 842 పాయింట్లు తగ్గింది. గత మంగళవారంనాటి ఇంట్రాడే గరిష్ఠం 62,245 పాయింట్ల స్థాయి నుంచి 1,300 పాయింట్లు నష్టపోయింది. తాజాగా ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 88 పాయింట్లు క్షీణించి 18,178 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఈ సూచీ రికార్డుస్థాయి నుంచి 400 పాయింట్లపైగా కోల్పోయింది. ఈ మూడు రోజుల్లో ఇన్వెస్టర్ల సంపద రూ. 8.47 లక్షల కోట్ల మేర తగ్గింది. బీఎస్ఈలో లిస్టయిన మొత్తం కంపెనీల మార్కెట్ విలువ రూ.8,47,397 లక్షల కోట్ల తగ్గుదలతో రూ.2,66,22,209 కోట్లకు దిగింది. ఇటు దేశీయ మ్యూచువల్ ఫండ్స్, అటు విదేశీ ఇన్వెస్టర్లు వరుస విక్రయాలు జరుపుతున్నారని, మార్కెట్ అధిక విలువకు చేరిందన్న భావన వారిలో ఉందని జియోజిత్ ఫైనాన్షియల్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్కుమార్ చెప్పారు.
ఏషియన్ పెయింట్స్ టాప్ లూజర్..
గురువారంనాటి మార్కెట్ పతనంలో సెన్సెక్స్-30 షేర్లలో అన్నింటికంటే అధికంగా ఏషియన్ పెయింట్స్ 5.2 శాతం తగ్గింది. సెప్టెంబర్ త్రైమాసికంలో ఈ కంపెనీ నికరలాభం 29 శాతం క్షీణించిందన్న వార్తతో ఇన్వెస్టర్లు విక్రయాలు జరిపారు. నష్టపోయిన షేర్లలో రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్ టెక్నాలజీస్, డాక్టర్ రెడ్డీస్ లాబ్, టాటా స్టీల్, టీసీఎస్, భారతి ఎయిర్టెల్లు ఉన్నాయి. మరోవైపు కొటక్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఎన్టీపీసీ, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్లు 6 శాతం వరకూ పెరిగాయి.
బ్యాంక్ నిఫ్టీ రికార్డ్…
ఒకవైపు ప్రధాన సూచీలు వరుస పతనాల్ని చవిచూస్తున్నా, బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్లు కొనసాగడంతో బ్యాంక్ నిఫ్టీ 40,030 పాయింట్ల వద్ద ముగిసి కొత్త రికార్డు నెలకొల్పింది. బ్యాంకింగ్ షేర్లలో అన్నింటికంటే ఎక్కువగా కొటక్ బ్యాంక్ 6 శాతంపైగా ర్యాలీ జరిపి రూ.2,155 వద్ద చరిత్రాత్మక గరిష్ఠం వద్ద నిలిచింది. ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్బీఐ, ప్రైవేటు రంగ ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు కూడా వాటి రికార్డు గరిష్ఠాలకు సమీపంలో క్లోజయ్యాయి.