(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, అక్టోబర్ 19, (నమస్తే తెలంగాణ) : చెప్పే మాటలకూ చేసే చేతలకూ సంబంధం లేదని మోదీ ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు నిరూపించుకుంది. ఉద్యోగాలిస్తామన్న హామీలకు భిన్నంగా ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టే చర్యలు చేపట్టింది. ఏటా రెండుకోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి అధికారం లోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం.. ఆ హామీని నిలబెట్టుకోకపోగా, ఉన్న కంపెనీలకు తాళాలు పడే పరిస్థితిని తీసుకువచ్చింది. కొత్త పరిశ్రమల ఏర్పాటు లేదు. ప్రభుత్వరంగ సంస్థల్ని బతకనివ్వలేదు. కరోనా కాటేసినా కనికరించలేదు. ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. వెరసి పారిశ్రామికరంగం అతలాకుతలమైంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ హయాంలో గడిచిన ఎనిమిదేండ్లలో 7లక్షల 84వేల 841 రిజిస్టర్డ్ కంపెనీలు మూతపడినట్టు సమాచారం. అంటే సగటున రోజుకు 270 కంపెనీలకు తాళాలు పడ్డాయన్నమాట. గత ఏడాది 2021జూన్ నాటికి దేశవ్యాప్తంగా 7.62 లక్షల కంపెనీలు మూతపడగా, ఈ ఏడాదికి ఈ సంఖ్య 7.84 లక్షలకు చేరుకున్నట్టు డిపార్టుమెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అస్సెట్స్ మేనేజ్మెంట్ నివేదికనే బయటపెట్టింది.
ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోని ప్రధాని మోదీ.. కనీసం ప్రైవేట్ కంపెనీలు, ప్రభుత్వ రంగ సంస్థలు మూత పడకుండా చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కరోనా కాలంలో లాక్డౌన్ కారణంగా కంపెనీలు మూతపడటంతో తీవ్రంగా నష్టపోయిన వాటి ఉద్దీపపనకు రూ.16 లక్షల కోట్ల ఆర్థిక సాయం అందించడానికి నిధి ఏర్పాటు చేస్తామని ప్రకటించినప్పటికీ అమలుకు నోచుకోలేదు. దీంతో బీజేపీ నేతృత్వంలోని ప్రధాని మోదీ హయాంలోనే 7 లక్షల 84 వేల 841 రిజిస్టర్డ్ కంపెనీలు మూతపడినట్టు తాజా సమాచారం. ఫలితంగా కోట్లాదిమంది కార్మికులు, ఉద్యోగులు ఉపాధి కోల్పోయి బజారునపడ్డారు. అయినప్పటికీ బీజేపీ ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంతో.. దేశ ఆర్థికానికి ప్రధాన ఆధారమైన పారిశ్రామిక రంగం చతికిలపడింది. ఫలితంగా భారత్ ఆర్థిక సంక్షోభం మున్ముందు మరింత తీవ్రం కావచ్చునని నిపుణుల హెచ్చరిస్తున్నారు.
సేవలరంగంలోనే అత్యధికం
గత ఎనిమిదేండ్లలో మూతపడిన రిజిస్టర్డ్ కంపెనీలలో అత్యధికం సేవలరంగానివే. సర్వీస్ సెక్టార్లో 28శాతం, తయారీ రంగంలో 24శాతం, ట్రేడింగ్లో 11శాతం, నిర్మాణరంగంలో 10శాతం కంపెనీలు మూతపడ్డాయి. ఇతర రంగాల్లో మూతపడినవి మరో 27శాతం వరకు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 22,17,026 కంపెనీలు రిజిస్టర్డ్ కాగా ఇందులో 7,84,841 కంపెనీలు మూతపడ్డాయి. ఇదే బాటలో ఇంకా లక్షల కంపెనీలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా మూతపడుతున్న కంపెనీలు సగటున రోజుకు 270 ఉన్నాయన్నది కేంద్రప్రభుత్వ కార్పొరేట్ వ్యవహారాల శాఖ అధికారికంగా వెల్లడించిన సమాచారం.
ప్రభుత్వరంగంపై మోదీసర్కారు చావుదెబ్బ
‘ప్రభుత్వరంగ సంస్థలను నడపించాల్సిన అవసరం, అవశ్యకత ఎంత మాత్రమూ లేదు. అది అసంభవం కూడా’… ప్రభుత్వరంగ సంస్థల మూసివేత అంశంపై గత ఏడాది జూన్లో డిపార్టుమెంట్ ఆఫ్ ఇన్వెస్టెమెంట్ అండ్ పబ్లిక్ అస్సెట్స్ మేనేజ్మెంట్ నిర్వహించిన వెబ్నార్లో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలివి. ప్రభుత్వరంగ సంస్థల నిర్వహణ ప్రభుత్వానికి పెనుభారంగా మారిందన్న కేంద్ర ప్రభుత్వ వాదనలో ఇసుమంతైనా వాస్తవం లేదు. కేవలం వీటిని బడా వాణిజ్యవేత్తలకు, బీజేపీ అనుకూల పారిశ్రామికవేత్తలకు ధారాదత్తం చేయడానికి మోదీ చెప్పిన కుంటిసాకు మాత్రమేనన్న విమర్శలున్నాయి. వాస్తవానికి ఈ 8 ఏండ్లలో 2014-15 మొదలు 2021-22 వరకు ప్రభుత్వరంగ సంస్థలు ఆర్జించిన ఆదాయం రూ.1,53,91,345 కోట్లు. అలాగే ప్రభుత్వరంగ సంస్థలలో గడిచిన 8ఏండ్లలో కేంద్రం వాటాల ఉపసంహరణ ద్వారా సొమ్ము చేసుకున్న మొత్తం రూ.4,32,708 కోట్లు.
ప్రైవేట్ సంస్థలు కరోనా సమయంలో లాక్డౌన్ కారణంగా మూతపడి నష్టపోయాయి. అవి తిరిగి ప్రారంభం కావడానికి కేంద్రం సాయం చేయలేదు. ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వరంగ సంస్థలను మూసివేసిన కేంద్రం.. వాటిలో నుంచి ఉపసంహరించుకున్న పెట్టుబడులను ప్రైవేట్సంస్థలకు ధారాదత్తం చేసింది. దీంతో లక్షల మంది కార్మికులు రోడ్డునపడ్డారు.