Scindia on Air India | ఎయిరిండియా ప్రైవేటీకరణపై కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా షాకింగ్ కామెంట్స్ చేశారు. 69 ఏండ్ల క్రితం ఎయిరిండియా జాతీయకరణ ద్వారా చేసిన పొరపాటును సరిదిద్దుకుంటున్నామని శుక్రవారం ఏఎన్ఐ వార్తా సంస్థతో చెప్పారు. ఎయిరిండియాలో ప్రభుత్వ వాటాల ఉపసంహరణ ప్రక్రియ క్రెడిట్ అంతా ప్రధాని నరేంద్రమోదీకే చెందుతుందన్నారు. ఎయిరిండియా ప్రైవేటీకరణ పట్ల ఆయన అంకిత భావం, సంకల్పశక్తి, స్పష్టత అమోఘం అని కొనియాడారు.
ప్రభుత్వ హయాంలో వ్యాపార లావాదేవీలు జరుపరాదని ప్రధాని నరేంద్రమోదీ నమ్ముతారన్నారు. ఎంటర్ప్రైజెస్, బిజినెస్లకు సానుకూల వాతావరణం కల్పించడానికి ఆయన మద్దతునిస్తారని చెప్పారు. ప్రధాని మోదీ విజన్, మార్గదర్శకత్వం వల్లే ఎయిరిండియా ప్రైవేటీకరణ ప్రక్రియ పూర్తయిందన్నారు. మొత్తం ఎయిరిండియా ప్రైవేటీకరణ ప్రక్రియలో సహకరించిన ఆర్థికశాఖలోని అధికారులందరికీ ధన్యవాదాలు తెలిపారు. గురువారం లాంఛనంగా టాటా సన్స్కు ఎయిరిండియా యాజమాన్యాన్ని అప్పగించిన సంగతి తెలిసిందే.
ఎయిరిండియా ప్రైవేటీకరణ వల్ల ప్రభుత్వం, టాటా సన్స్తోపాటు ప్రతి ఒక్కరికి సానుకూల పరిస్థితులు ఏర్పడతాయన్నారు. ఎయిరిండియా ప్రైవేటీకరణతో పౌర విమానయాన రంగంలో శక్తి సామర్థ్యాలు భారీగా బయటకు వస్తాయన్నారు. 69 ఏండ్ల క్రితం ప్రైవేట్ రంగంలో ఉన్న ఎయిరిండియా జాతీయకరణతో చేసిన పొరపాటును తిరిగి ప్రైవేట్ రంగానికి అప్పగించడంతో సరిదిద్దుతున్నాం. ఈ ప్రక్రియ ముగియడానికి 20 ఏండ్ల టైం పట్టింది అని జ్యోతిరాదిత్య సింధియా అన్నారు.
గత 14 ఏండ్లుగా ఎయిరిండియా రూ.85 వేల కోట్ల నష్టంతో నడుస్తుందని జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. రుణ భారం సుమారు రూ.10 లక్షల కోట్ల రుణభారాన్ని మోస్తున్నదన్నారు. ప్రతి రోజూ రూ.20 కోట్ల నష్టంతో ఏటా రూ.7500 కోట్ల నష్టాన్ని భరిస్తున్నదని తెలిపారు. ఇదంతా టాక్స్ పేయర్స్ మనీ అని చెప్పారు. టాక్స్పేయర్ల నుంచి వచ్చే ఆదాయంతో సామాజిక అభివృద్ధి, పెట్టుబడి రంగాలపై ఖర్చు చేయాల్సిన అవసరం ఉందన్నారు.