హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ): ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 627 లక్షల టన్నుల బొగ్గును ఉత్తత్తి చేశామని సింగరేణి సీఎండీ బలరాం వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే సమయానికి ఉత్పత్తి చేసిన 601 లక్షల టన్నులతో పోలిస్తే 4.3 శాతం అధికమని ఆయన పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం మొత్తానికి 700 లక్షల టన్నుల వార్షిక లక్ష్యాన్ని అధిగమించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కంపెనీ ఉన్నతాధికారులకు సూచించారు. శుక్రవారం సింగరేణి భవన్లో జరిగిన సమీక్ష సమావేశానికి కంపెనీ డైరెక్టర్లు, ఏరియాల జనరల్ మేనేజర్లు హాజరయ్యారు. నిర్దేశించుకున్న లక్ష్యానికి చేరుకోవాలంటే ఈ నెలలో రోజుకు 2.35 లక్షల టన్నుల బొగ్గును వెలిక్కి తీయాల్సిన అవసరం ఉన్నదని, అప్పుడే లక్ష్యాన్ని అధిగమించేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. మొత్తం 12 ఏరియాల్లో మణుగూరు, కొత్తగూడెం, ఇల్లెందు, బెల్లంపల్లి ఏరియాలు లక్ష్యాలు అధిగమించడంపై సంతోషం వ్యక్తం చేశారు.