ముంబై, మే 20: ఐదేండ్ల క్రితం జారీచేసిన సావరిన్ గోల్డ్ బాండ్లను (ఎస్జీబీ) ముందస్తుగా అప్పగించి, నగదు తీసుకోవడానికి రిజర్వ్బ్యాంక్ ధరను నిర్ణయించింది. 2023 మే 20 నాటికి ముందస్తు రిడంప్షన్కు వచ్చిన ఈ బాండ్ల ఒక్కో యూనిట్కు చెల్లింపు ధరను రూ.6,047గా నిర్ణయించినట్టు రిజర్వ్బ్యాంక్ తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్లో తెలిపింది. 2017 నవంబర్ 20వ తేదీతో జారీఅయిన ఎస్జీబీ 2017-18 సిరీస్ 8ను ముందస్తు రిడంప్షన్కు మే 20నాటి నుంచి అనుమతిస్తున్నట్టు తెలిపింది. 2023 మే 17-19 తేదీల మధ్య మూడురోజుల బంగారం సగటు ముగింపు ధర ఆధారంగా ఈ బాండ్లను రిడంప్షన్ ధర నిర్ణయించినట్టు ఆర్బీఐ తెలిపింది. ఇండియా బులియన్ అండ్ జ్యువెల్లర్స్ అసోసియేషన్ ప్రకటించిన ధరను బాండ్లకు ఆర్బీఐ అనుసరిస్తున్నది.
వాస్తవానికి దఫదఫాలుగా రిజర్వ్బ్యాంక్ జారీచేస్తున్న గోల్డ్ బాండ్ల కాలపరిమితి జారీ తేదీ నుంచి ఎనిమిదేండ్లకు పూర్తవుతుంది. అయితే ఐదేండ్లు పూర్తయిన తర్వాత ముందస్తుగా బాండ్లను నగదుగా మార్చుకునేందుకు అనుమతిస్తుంది. ఈ బాండ్లు కలిగినవారు అవసరమైతే ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. లేదా ఎనిమిదేండ్ల పూర్తికాలానికి అట్టిపెట్టుకోవచ్చు. బాండ్లు జారీచేసిన సమయంలో బంగారం ధరను అనుసరించి బాండ్ల ధరను నిర్ణయిస్తారు. వాటిపై 2.5 శాతం వార్షిక వడ్డీని ఇస్తారు. వడ్డీని ఆరు నెలలకోసారి చెల్లిస్తారు. కాలపరిమితి తర్వాత రిడంప్షన్ సమయంలో బంగారం ధర ఎంత ఉంటే ఆ మొత్తాన్ని రిజర్వ్బ్యాంక్ చెల్లిస్తుంది.