IT Returns | గత ఆర్థిక సంవత్సరానికి 6.98 కోట్ల ఐటీ రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలయ్యాయని ఆదాయం పన్ను విభాగం మంగళవారం తెలిపింది. వాటిల్లో 6.84 కోట్ల ఐటీఆర్ల ఈ-వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిందని పేర్కొంది. వాటిలో ఆరు కోట్ల ఐటీఆర్ల ప్రాసెసింగ్ పక్రియ పూర్తయింది. అంటే 88 శాతం వెరిఫైడ్ రిటర్న్స్ ప్రాసెసింగ్ పూర్తయినట్లేనని ఓ ప్రకటనలో వెల్లడించింది. 2.45 కోట్ల ఐటీ రిటర్న్స్లో రీఫండ్స్ కూడా జారీ చేశామని వివరించింది.
ఐటీ రిటర్న్స్ ప్రాసెసింగ్ సమయం సగటున పది రోజులకు తగ్గిందని ఐటీ విభాగం తెలిపింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఐటీఆర్ల ప్రాసెసింగ్కు 82 రోజుల సమయం పడితే, 2021-22 ఆర్థిక సంవత్సరంలో 16 రోజులకు కుదించుకుపోయిందని వివరించింది.
14 లక్షల మంది ఐటీఆర్లు దాఖలు చేసినా.. సెప్టెంబర్ నాలుగో తేదీ వరకు వారి ఈ-వెరిఫికేషన్ కోసం వేచి ఉన్నాయని ఆదాయం పన్ను విభాగం తెలిపింది. టాక్స్ పేయర్లు వీటిని వెరిఫై చేస్తేనే తాము ఆయా ఐటీ రిటర్న్స్ ప్రాసెస్ చేయగలమని స్పష్టం చేసింది. మరో 12 లక్షల ఐటీఆర్లు వెరిఫై అయినా, వాటిపై సమాచారం ఇవ్వాల్సిందిగా ఈ-ఫైలింగ్ అడ్రస్సులకు సమాచారం పంపామని తెలిపింది.