5G Services in December |త్వరలోనే స్పెక్ట్రం వేలం వేస్తాం
రాజ్యసభలో ప్రకటించిన కేంద్రం
న్యూఢిల్లీ, మార్చి 25: ఈ ఏడాది ఆఖర్లోగా దేశంలో 5జీ సేవలు మొదలవుతాయని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ప్రకటించింది. ఇందుకు సంబంధించిన స్పెక్ట్రం వేలాన్ని అతి త్వరలోనే ప్రారంభిస్తామని శుక్రవారం కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి దేవుసిన్ చౌహాన్ తెలిపారు.
కొశ్చన్ అవర్ సందర్భంగా అడిగిన అనుబంధ ప్రశ్నకు సమాధానమిస్తూ ఇప్పటికే నాలుగు టెలికం సంస్థలకు 5జీ సేవల ట్రయల్ రన్ కోసం స్పెక్ట్రంను కేటాయించామని చెప్పారు. త్వరలోనే ఈ ట్రయల్స్ పూర్తికావచ్చన్న మంత్రి.. రాబోయే వేలానికి సంబంధించి సిఫార్సులు ఇవ్వాలని టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ను సైతం కోరినట్టు చెప్పారు.
5జీ అనేది ప్రస్తుతం నడుస్తున్న 4జీ నెట్వర్క్కు అప్డేట్ వెర్షన్. ఇప్పుడున్న ఇంటర్నెట్ వేగం.. 5జీ రాకతో ఊహించనంతగా పెరుగుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే క్షణాల్లో ఎంత పెద్ద వీడియోనైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
అంతేగాక కేవలం స్మార్ట్ఫోన్లలోనేగాక రోబోలు, మెషీన్లు, స్మార్ట్ కార్లు, ఇతరత్రా వాటిల్లోనూ ఈ 5జీ నెట్వర్క్ను వాడుకోవచ్చు. అయితే ఇప్పుడున్న అన్ని 4జీ స్మార్ట్ఫోన్లలో ఈ 5జీ నెట్వర్క్ సౌకర్యం ఉండకపోవచ్చు. ప్రత్యేకంగా 5జీ మొబైల్స్ను కొనాల్సి రావచ్చు.
ప్రధానంగా మూడు శ్రేణుల్లో 5జీ సేవలు పొందవచ్చు. ఇవే లో-ఫ్రీక్వెన్సీ, మీడియం-ఫ్రీక్వెన్సీ, హై-ఫ్రీక్వెన్సీ బ్యాండ్లు. మీడియం-ఫ్రీక్వెన్సీలోని 1 గిగాహెట్జ్-6 గిగాహెట్జ్ శ్రేణిలోగల స్పెక్ట్రం టెలికం సంస్థలకు లాభదాయకం.
ఇందులో పెద్ద ఎత్తున డాటాను వినియోగించుకోవచ్చు. ప్రధానంగా 2.3-4.7 గిగాహెట్జ్ ఎక్కువ దూరం కూడా ప్రసారమవుతుంది. ఇక లో-ఫ్రీక్వెన్సీ 5జీ బ్యాండ్లో 4జీ కంటే డౌన్లోడ్ స్పీడ్ కాస్త ఎక్కువగా ఉంటుంది. హై-ఫ్రీక్వెన్సీలో 24-47 గిగాహెట్జ్ తరంగాలుంటాయి.
తమ స్పెక్ట్రం బకాయిల్లో రూ. 8,815 కోట్లు ముందస్తుగా చెల్లించినట్టు టెలికం సంస్థ భారతి ఎయిర్టెల్ తెలిపింది. 2015 వేలంలో తాము కొనుగోలు చేసిన స్పెక్ట్రంకు సంబంధించి 2027, 2028 ఆర్థిక సంవత్సరాల్లో చెల్లించాల్సిన వాయిదాల్ని, ప్రభుత్వానికి తాజాగా కట్టినట్టు శుక్రవారం కంపెనీ పేర్కొంది. గత నాలుగు నెలల్లో రూ.24,334 కోట్లు స్పెక్ట్రం బకాయిల్ని ముందస్తుగా చెల్లించినట్టు తెలిపింది.
ఈ వాయిదాలపై 10 శాతం వార్షిక వడ్డీ రేటు పడుతున్నదని, తమ వ్యాపారంలో ఆర్జించిన నగదు, ఈక్విటీ ద్వారా వచ్చిన నిధులు, తక్కువ వడ్డీతో కూడిన బాండ్ల జారీ ద్వారా సమీకరించిన డబ్బును ఈ చెల్లింపులకు ఉపయోగించినట్లు కంపెనీ వివరించింది.
ఈ ఏడాది బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు మొదలవుతాయని మంత్రి చౌహాన్ చెప్పారు. బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ బలోపేతానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అయితే ఇతర ప్రైవేట్ రంగ సంస్థలు దేశవ్యాప్తంగా 5జీ సేవల్ని ప్రారంభించే దిశగా వెళ్తుంటే.. ప్రభుత్వ రంగ సంస్థలై ఉండి ఇంకా 4జీకే పరిమితం కావడం ఏమిటన్న విమర్శలు టెలికం రంగ నిపుణుల నుంచి వస్తున్నాయి. ఇక దేశంలో తక్కువ ధరకే ఎక్కువ మొత్తంలో డాటా లభిస్తున్నదని, దీంతో డాటా వినియోగం, స్మార్ట్ఫోన్ యూజర్లు ఏటేటా గణనీయంగా పెరుగుతున్నారని మంత్రి పేర్కొన్నారు.