హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 21(నమస్తే తెలంగాణ): శంషాబాద్ ఎయిర్పోర్ట్ మరో రికార్డును సృష్టించింది. జనవరి 30న ఒకేరోజు 536 విమానాలు రాకపోకలు సాగించాయి. ఒకేరోజు ఇన్ని విమాన సర్వీసులు రాకపోకలు సాగించడం ఇదే తొలిసారని జీఎమ్మార్ ఎయిర్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వెల్లడించింది. అలాగే గత నెల చివరినాటికి విమాన ప్రయాణికుల సంఖ్య 2.07 కోట్లకు చేరుకున్నట్లు తెలిపింది. జనవరి నెలలో 21.81 లక్షల మంది ప్రయాణించగా..ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 2.07 కోట్ల మంది ప్రయాణించినట్లు వెల్లడించింది.
పెరిగిన కస్టమర్లు
విమాన ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ రూపొందించిన డిజిటల్ యాప్నకు అపూర్వ స్పందన లభిస్తున్నది. సివిల్ ఏవియేషన్ రూపొందించిన ఈ యాప్ సేవలు ఇప్పటికే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అందుబాటులోకి వచ్చాయి. గతేడాది డిసెంబర్ నాటికి 10 లక్షల మంది ప్రయాణికులు వినియోగించుకోగా..తాజాగా ఈ నెల 11 నాటికి ఈ సంఖ్య 14,92,776కి చేరుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1.45 కోట్ల ప్రయాణికులు డీజీయాత్రను వినియోగించినట్లుగా వెల్లడైంది.