Budget 2023-24 | కేంద్రం తన పక్షపాత బుద్దిని బయట పెట్టుకుంటూనే ఉన్నది. అన్నిరాష్ట్రాలను సమదృష్టితో చూడాల్సిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న కర్ణాటకపై కరుణ చూపారు. నీటి పారుదల శాఖ ప్రాజెక్టుల కోసం రూ.5,300 కోట్ల కేంద్ర ప్రభుత్వ సాయం ప్రకటించారు. 2023-24 ఆర్థిక సంవత్సర బడ్జెట్ను నిర్మలా సీతారామన్ బుధవారం లోక్సభలో ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా కర్ణాటక పట్ల తమ ప్రభుత్వ ప్రేమను కనబరిచారు.
అప్పర్ భద్ర ప్రాజెక్టుకు ఈ కేంద్ర సాయం ప్రకటించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. కరువుతో కొట్టుమిట్టాడుతున్న మధ్య కర్ణాటక ప్రాంతాలను ఆదుకునేందుకు అప్పర్ భద్ర ప్రాజెక్టుకు రూ.5,300 కోట్ల ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. తుంగ భద్ర నదిపై గల భద్ర రిజర్వాయర్ నుంచి ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ కింద 17.40 టీఎంసీల నీటిని తరలించేందుకు అప్పర్ భద్ర ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది కర్ణాటక సర్కార్.
ఏప్రిల్-మే మధ్య కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ప్రస్తుతం బస్వరాజ్ బొమ్మై సారధ్యంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ సారధ్యంలోని సెక్యులర్ జనతాదళ్ (జేడీఎస్) నుంచి అధికార బీజేపీ గట్టి పోటీని ఎదుర్కొంటున్నది. తమ సాగునీటి ప్రాజెక్టుకు కేంద్ర సాయం ప్రకటించినందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు కర్ణాటక సీఎం బస్వరాజు బొమ్మై ధన్యవాదాలు తెలిపారు.