న్యూఢిల్లీ, అక్టోబర్ 10: ప్రత్యక్ష పన్ను వసూళ్లు అంతకంతకు పెరుగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను ప్రవేశపెట్టిన సార్వత్రిక బడ్జెట్లో అంచనావేసిన దాంట్లో 52.5 శాతం వసూలయ్యాయి. ఈ నెల 9 నాటికి రూ.9.57 లక్షల కోట్లు ప్రత్యక్ష పన్ను వసూలైనట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
క్రితం ఏడాది వసూలైన దాంతో పోలిస్తే 21.82 శాతం అధికం. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్లో రూ.18.23 లక్షల కోట్ల మేర ప్రత్యక్ష పన్ను వసూలుకానున్నట్టు కేంద్రం అంచనావేసిన విషయం తెలిసిందే. అలాగే స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు ఏడాది ప్రాతిపదికన 17.95 శాతం ఎగబాకి రూ.11.07 లక్షల కోట్ల కు చేరుకున్నాయి. కార్పొరేట్ ఆదాయ పన్ను, వ్యక్తిగత ఆదాయ పన్ను కలుపుకొని స్థూల ఆదాయం వసూలు కానున్నది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబర్ 9 వరకు రూ.1.50 లక్షల రీఫండ్ చెల్లింపులు జరిపినట్టు తెలిపింది.