కొత్త ఆర్థిక సంవత్సరం కోసం కేంద్ర బడ్జెట్ దాదాపు సిద్ధమైంది.
మరో 10 రోజుల్లో మోదీ సర్కారు పార్లమెంట్లో ప్రవేశపెట్టబోయే ఈ బడ్జెట్పై రకరకాల అంచనాలు సహజమే.
అయితే దేశ ప్రజలు ఈసారి బడ్జెట్లో ఏం కోరుకుంటున్నారన్నదానిపై ఓ తాజా సర్వేలో ఆరోగ్యానికే అగ్రతాంబూలం ఇవ్వాలన్న అభిప్రాయాలు పెద్ద ఎత్తున వ్యక్తమయ్యాయి.
న్యూఢిల్లీ, జనవరి 20: కొత్త పద్దులో ఆరోగ్య సంరక్షణ, వైద్య రంగాలను చిన్నచూపు చూడవద్దని దేశంలోని మెజారిటీ ప్రజలు కోరుతున్నారు. కరోనా నేపథ్యంలో రాబోయే కేంద్ర బడ్జెట్పై గతంతో పోల్చితే ఈసారి భిన్నమైన అంచనాలే నెలకొన్నాయి మరి. తాజాగా జరిగిన ఓ సర్వేలో వచ్చే బడ్జెట్లో వైద్య, ఆరోగ్య రంగానికే పెద్దపీట వేయాలని ఎక్కువ మంది ప్రజానీకం అభిప్రాయపడింది. కరోనాతో దేశంలో ఆరోగ్య సంరక్షణ రంగం ఎంత బలంగా ఉన్నదో తేలిపోయింది. ప్రజారోగ్య వ్యవస్థలోని డొల్లతనం, లోపాలూ బయటపడ్డాయి. పడకల కొరత, అత్యవసర సదుపాయాల లేమి స్పష్టంగా కనిపించింది. దీంతో రాబోయే బడ్జెట్లో మెరుగైన వైద్య వ్యవస్థకే సింహభాగం నిధులు దక్కాలని ఈ సర్వేలో మిక్కిలి ప్రజలు కోరుకుంటున్నారు. 2023-24కుగాను ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నది తెలిసిందే.