హైదరాబాద్ సిటీబ్యూరో, మే 9 (నమస్తే తెలంగాణ) : దక్షిణ మధ్య రైల్వే(ఎస్సీఆర్) అంచనాలకుమించి రాణిస్తున్నది. గత నెలలో ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చడం ద్వారా రూ.465.38 కోట్ల ఆదాయం సమకూరినట్టు రైల్వే అధికారులు తెలిపారు. ఒక నెలలో ఇంతటి స్థాయిలో ఆదాయం రావడం ఇదే తొలిసారని రైల్వే ఉన్నతాధికారులు తెలిపారు. ఏప్రిల్ 2023లో 2.19 కోట్ల మంది ప్రయాణికులు రైల్వేను వినియోగించుకున్నారు.
క్రితం ఏడాది ఇదే నెలలో 1.72 కోట్ల మంది ప్రయాణికులతో పోలిస్తే 27.10 శాతం అధికమని పేర్కొంది. రోజు నడిచే రైళ్లతోపాటు 65 ప్రత్యేక రైళ్లు ప్రవేశపెట్టడం కూడా ఆదాయం పెరగడానికి దోహదం చేసినట్టు తెలిపారు. అలాగే 11.298 మెట్రిక్ టన్నుల సరుకు రవాణా చేసింది. తద్వారా రూ.1,106 కోట్ల ఆదాయం ఆర్జించింది.