న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: కరోనా ఢీలా పడిన దేశీయ ఎగుమతులు మళ్లీ ఊపందుకున్నాయి. విదేశాల్లో దేశీయ ఉత్పత్తులకు డిమాండ్ ఊపందుకోవడంతో గత నెలలో ఎగుమతుల్లో 45 శాతం వృద్ధి నమోదైంది. నికరంగా 33.14 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అంతక్రితం ఏడాది ఇదే నెలలో 22.83 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరిగాయి. ఇదే నెలలో భారత్ 47.01 బిలియన్ డాలర్ల ఉత్పత్తులను విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నది. 2020 ఆగస్టులో దిగుమతి అయిన 31.03 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఇది 51.74 శాతం అధికం. వాణిజ్యలోటు 13.87 బిలియన్ డాలర్లుగా నమోదైంది. మొత్తంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలలో ఎగుమతులు 66.92 శాతం పెరిగి 163.67 బిలియన్ డాలర్లకు చేరుకోగా, దిగుమతులు 81.75 శాతం అధికమై 219.54 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.