న్యూఢిల్లీ, జూన్ 23: నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ, విజయ్ మాల్యా కేసుల్లో బ్యాంకులకు వాటిల్లిన నష్టాల్లో 40 శాతం తిరిగి పూడ్చగలిగామని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలిపింది. రూ.5,824.50 కోట్ల విలువైన యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ షేర్లను మాల్యాకు అప్పులిచ్చిన ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకర్ల తరఫున రుణాల రికవరీ ట్రిబ్యునల్ బుధవారం అమ్మినట్లు పేర్కొన్నది. దీంతో ఇప్పటిదాకా ఈ కేసుల్లో రూ.9,041.5 కోట్లను రికవరీ చేశామని అధికారులు పేర్కొన్నారు. అలాగే ఈ మొత్తాన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులకు బదిలీ చేశామని స్పష్టం చేశారు. ఈ మోసాల్లో బ్యాంకులు మొత్తం రూ.22,585.83 కోట్లు నష్టపోయాయని చెప్పారు. కాగా, ‘పరారీ ఆర్థిక నేరగాళ్ల కేసులను వేగంగా దర్యాప్తు చేస్తున్నాం. వారి ఆస్తులను జప్తు చేసి, బకాయిలను వసూలు చేస్తున్నాం’ అని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సందర్భంగా ట్వీట్ చేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ను నీరవ్, చోక్సీలు రూ.13,000 కోట్లు మోసం చేయగా, కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ పేరుతో పలు బ్యాంకులకు మాల్యా రూ.9,000 కోట్లు ఎగవేశారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ కేసులు నమోదు చేయగా, ఈ రెండు కేసుల్లో మొత్తం రూ.18,170.02 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నది. వీటిలో రూ.969 కోట్ల ఆస్తులు విదేశాల్లో ఉన్నాయి.