MTNL | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): ప్రతిష్ఠాత్మక ప్రభుత్వ రంగ టెలికం సంస్థ ఎంటీఎన్ఎల్ (మహానగర టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్)ను కేంద్ర ప్రభుత్వం మూసివేసేందుకు ఆలోచిస్తోంది. బీఎస్ఎన్ఎల్లో ఎంటీఎన్ఎల్ను విలీనం చేయాలన్న ప్రతిపాదనను కూడా పరిశీలించినా.. రుణాల ఊబిలో కూరుకుపోయినందున అది లాభదాయకం కాదన్న నిర్ణయానికి కేంద్రం వచ్చినట్టు తెలుస్తున్నది. ఎంటీఎన్ఎల్ సిబ్బందిని కూడా తొలుత బీఎస్ఎన్ఎల్లో కలిపేద్దామనుకున్నా.. ఆ తర్వాత వారికి వీఆర్ఎస్ అమలు చేయడమే ఉత్తమ మార్గంగా ప్రభుత్వం ఆలోచిస్తున్నదని సమాచారం. ఇదే జరిగితే వేలాది మంది భవిష్యత్తు అగమ్యగోచరంగా మారనున్నది. ఇక ఎంటీఎన్ఎల్ ఉన్నతాధికారుల ద్వారా అందిన సమాచారం మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఇచ్చిన రిపోర్టులో కూడా ఎంటీఎన్ఎల్ను రుణగ్రస్థ సంస్థగా, దాని విలీనం వల్ల బీఎస్ఎన్ఎల్కూ గుదిబండగా మారుతుందని పేర్కొన్నట్టు చెప్తున్నారు.
కాగా, బీఎస్ఎన్ఎల్లో ఎంటీఎన్ఎల్ విలీన ప్రతిపాదనపై కేబినెట్లో చర్చించి ఈ అంశాన్ని పరిశీలించాలని ప్రత్యేకంగా ఓ కార్యదర్శుల కమిటీని కూడా కేంద్రం నియమించింది. కానీ ఆ ప్రతిపాదన అంత ఉపయోగకరంగా ఉండదనే నిర్ణయానికి వారు వచ్చినట్టు తెలిసింది. నిజానికి గత ఏడాదే టెలికం శాఖ సహాయ మంత్రి దేవ్సింగ్ చౌహాన్ అధిక రుణాలు, ఇతరత్రా ఆర్థిక కారణాల వల్ల బీఎస్ఎన్ఎల్లో ఎంటీఎన్ఎల్ విలీన ప్రతిపాదనను వాయిదా వేసినట్టు పార్లమెంటులో ప్రకటించారు. ఇది ఎంటీఎన్ఎల్ను మూసివేయాలన్న ఆలోచన కేంద్రానికి ఎప్పట్నుంచో ఉందన్న వార్తలకు బలం చేకూరుస్తున్నైట్టెంది. 2019లో బీఎస్ఎన్ఎల్తోపాటు ఎంటీఎన్ఎల్ పునరుద్ధరణకు రెండు ప్యాకేజీలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. రూ.69వేల కోట్ల సాయంతోపాటు క్యాపిటల్ ఇన్ఫ్యూషన్ ద్వారా 4జీ సేవలందించేందుకు స్పెక్ట్రం కేటాయింపు, విలీన ప్రతిపాదనలు ఇందులో ఉన్నాయి.
కాపాడాలనే తపనేది?
మొదట్నుంచీ ప్రైవేటీకరణను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్న మోదీ సర్కారు.. ఎంటీఎన్ఎల్ను కాలగర్భంలో కలిపేయాలనుకోవడం ఆశ్చర్యకరంగా ఏమీ అనిపించట్లేదన్న విమర్శలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఎంటీఎన్ఎల్ను కాపాడాలనే తపన కేంద్రానికి ఉంటే ఎలాగైనా దాన్ని రక్షిస్తుందని ఇండస్ట్రీ నిపుణులు అంటున్నారు. కానీ అది ఎంతమాత్రం ఇష్టం లేకనే ఈ రకమైన నిర్ణయాలకు దిగుతున్నదని విశ్లేషిస్తున్నారు. నిజానికి బీఎస్ఎన్ఎల్ కూడా పీకల్లోతు అప్పుల ఊబిలో కూరుకుపోయింది. అయితే ప్రభుత్వ సాయంతో నెమ్మదిగా ఇప్పుడా సంస్థ కోలుకుంటున్నది. దీంతో ఎంటీఎన్ఎల్నూ ఇలాగే కాపాడుకోవచ్చు కదా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఇక ప్రైవేట్ రంగ సంస్థలు 5జీ, 6జీ వైపు పరుగులు పెడుతుంటే.. ప్రభుత్వ రంగానికి చెందిన బీఎస్ఎన్ఎల్ మాత్రం 4జీ లక్ష్యాలను చేరుకోవడానికే అష్టకష్టాలు పడాల్సి వస్తున్నది. దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు ప్రభుత్వ సంస్థలపట్ల మోదీ సర్కారుకున్న చిత్తశుద్ధి ఏపాటిదో. మొత్తానికి ఎంటీఎన్ఎల్ ఆస్తులు, కార్యకలాపాలు, ఉద్యోగుల బదిలీ పేరిట బీఎస్ఎన్ఎల్ను విస్తరిస్తున్నామని చెప్పుకుంటున్న కేంద్రం.. మరో ప్రభుత్వ సంస్థను కనుమరుగు చేస్తున్నదన్నది మాత్రం నిజం.