గత మూడు సెషన్లుగా నష్టాలతో కాలంవెళ్లదీసిన మదుపరులు తిరిగి లాభపడ్డారు. స్టాక్ మార్కెట్లు భారీగా లాభపడటంతో వీరి సంపద రూ.4 లక్షల కోట్ల మేర పెరిగింది. దీంతో బీఎస్ఈలో లిైస్టెన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ.4 లక్షల కోట్లు పెరిగి రూ.373.57 లక్షల కోట్లకు చేరుకున్నది. అంతర్జాతీయ మార్కెట్లు పుంజుకోవడం, ముఖ్యంగా అమెరికా సూచీలు లాభాల్లో ముగియడం మదుపరులకు జోష్నిచ్చిందని దలాల్స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి.
ముంబై, జనవరి 19: స్టాక్ మార్కెట్ల వరుస పతనాలకు బ్రేక్పడింది. బ్లూచిప్ సంస్థల షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుకు తోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు సూచీలను లాభాలవైపు నడిపించాయి. వరుసగా మూడు రోజులుగా నష్టాలే పరమావదిగా కొనసాగిన సూచీలు ఎట్టకేలకు లాభాల్లోకి మళ్లాయి. ప్రారంభం నుంచే లాభాల బాట పట్టిన సూచీలు వారాంతం ట్రేడింగ్ ముగిసే సరికి భారీగా లాభపడింది. ఒక దశలో 700 పాయింట్లకు పైగా లాభపడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 496 పాయింట్లు అందుకొని 71,683.23 వద్ద ముగిసింది. మరో సూచీ నిఫ్టీ 21,600 పాయింట్ల కీలక స్థాయిని అధిగమించింది.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తీరు అంతే..
వరుసగా నాలుగో రోజు శుక్రవారం కూడా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు పడిపోయింది. బ్యాంక్ షేరు 1.08 శాతం పతనం చెందింది. దీంతో గత మూడు సెషన్లలో బ్యాంక్ షేరు 12 శాతం పతనం చెందినట్లు అయింది. బ్యాంక్ నాలుగో త్రైమాసికపు ఆర్థిక ఫలితాలు విడుదలైన నాటినుంచి షేరు దిగువముఖం పట్టింది.
నేడు మార్కెట్లలో ట్రేడింగ్
ఈ నెల 20 శనివారం స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ జరుగుతుందని ఎన్ఎస్ఈ ప్రతినిధి ఒకరు తెలిపారు. సోమవారం అయోధ్యలో శ్రీరామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా మహారాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించడంతో ఈ రోజున స్టాక్ మార్కెట్లు పనిచేయవు. దీంతో శనివారం సూచీలు పూర్తిస్థాయిలో పనిచేయనున్నాయని ప్రతినిధి తెలిపారు. సోమవారం స్టాక్ మార్కెట్లతోపాటు కరెన్సీ డెరివేటివ్ మార్కెట్లు కూడా పనిచేయవు. మరోవైపు, రిజర్వుబ్యాంక్ కార్యాలయాలకు సెలవుకావడంతో ఈ సోమవారం రూ.2 వేల నోట్ల ఎక్సేంజ్, డిపాజిట్ చేసుకునే అవకాశం లేదు.