Stock Market | ముంబై, మార్చి 1: దేశీయ స్టాక్ మార్కెట్లలో బుల్ రన్ దుమ్ము రేపింది. కొనుగోళ్ల జోష్లో మదుపరులు రెచ్చిపోయారు. దీంతో మునుపెన్నడూ లేనివిధంగా సూచీలు సరికొత్త స్థాయిలను చేరాయి. శుక్రవారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 1,245.05 పాయింట్లు లేదా 1.72 శాతం ఎగిసి ఆల్టైమ్ హై 73,745.35 వద్ద ముగిసింది. ఒకానొక దశలోనైతే 1,318.91 పాయింట్లు లేదా 1.81 శాతం పుంజుకొని ఇంట్రా-డే రికార్డు హై 73,819.21ని నెలకొల్పింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ సైతం 355.95 పాయింట్లు లేదా 1.62 శాతం ఎగబాకి లైఫ్టైమ్ హై 22,338.75 దగ్గర నిలిచింది. ఇంట్రా-డేలోనూ 370.5 పాయింట్లు లేదా 1.68 శాతం పెరిగి 22,353.30ను తాకింది.
ఇందుకే ఈ ఉత్సాహం
తయారీ రంగం దన్నుతో ఈ ఆర్థిక సంవత్సరం (2023-24) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో దేశ జీడీపీ గణాంకాలు ఆకర్షణీయంగా ఉండటం కలిసొచ్చిందని మార్కెట్ నిపుణులు తాజా ట్రేడింగ్ సరళిని విశ్లేషిస్తున్నారు. విదేశీ పెట్టుబడుల రాక పెరుగుతుండటం, అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లలో లాభాలు, ఫిబ్రవరి నెల వాహన విక్రయాలు బాగుండటం కూడా మార్కెట్ రికార్డుస్థాయి లాభాలకు దోహదం చేసినట్టు చెప్తున్నారు.
రంగాలవారీగా
మెటల్ రంగ షేర్లు అత్యధికంగా 3.84 శాతం పెరిగాయి. క్యాపిటల్ గూడ్స్ 2.49 శాతం, బ్యాంకింగ్ 2.48 శాతం, ఆటో 2.23 శాతం, ఎనర్జీ 2.14 శాతం, చమురు, గ్యాస్ 2.14 శాతం, కమోడిటీస్ 2.12 శాతం, ఇండస్ట్రియల్స్ 1.91 శాతం చొప్పున పుంజుకొన్నాయి. ఐటీ, టెక్నాలజీ రంగాల షేర్లు మాత్రం నష్టపోయాయి. ఇక బీఎస్ఈ మిడ్క్యాప్ సూచీ 0.89 శాతం, స్మాల్క్యాప్ సూచీ 0.68 శాతం పెరిగాయి. టాటా స్టీల్ షేర్ విలువ గరిష్ఠంగా 6 శాతానికిపైగా ఎగబాకింది. జేఎస్డబ్ల్యూ స్టీల్ 4 శాతానికిపైగా పెరిగింది. ఎల్అండ్టీ, టైటాన్, మారుతీ, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా మోటర్స్ షేర్లూ పుంజుకున్నాయి.
గ్లోబల్ మార్కెట్లలో
ఆసియా మార్కెట్లలో జపాన్, చైనా, హాంకాంగ్ సూచీలు లాభాల్లో ముగిశాయి. ఐరోపా మార్కెట్లలోనూ కీలకమైన జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్ సూచీలు లాభాల్లో కదలాడుతున్నాయి. అమెరికా మార్కెట్లు కూడా గురువారం లాభాల్లోనే స్థిరపడ్డాయి. ఈ ప్రభావం దేశీయ ఈక్విటీ మార్కెట్ల ట్రేడింగ్పై పడిందని ట్రేడర్స్ అభిప్రాయపడుతున్నారు.
నేడు ప్రత్యేక ట్రేడింగ్
దేశీయ స్టాక్ మార్కెట్లలో శనివారం ప్రత్యేక ట్రేడింగ్ జరుగనున్నది. అటు బీఎస్ఈ, ఇటు ఎన్ఎస్ఈలు.. ఈక్విటీ, ఈక్విటీ డెరివేటివ్ సెగ్మెంట్లలో ఈ స్పెషల్ ట్రేడింగ్ సెషన్స్ను నిర్వహించనున్నాయి. తొలుత ఉదయం 9:15 గంటల నుంచి 10 గంటల వరకు 45 నిమిషాలపాటు ప్రైమ్ సైట్ (పీఆర్)పై, ఆ తర్వాత ఉదయం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు గంటపాటు డిజాస్టర్ రికవరీ (డీఆర్) సైట్పై ప్రత్యేకంగా ట్రేడింగ్లను చేపట్టనున్నారు. ఈ మేరకు బాంబే స్టాక్ ఎక్సేంజ్, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్లు వేర్వేరు ప్రకటనలు చేశాయి. ప్రైమరీ సైట్పై వైఫల్యాలు, అంతరాయాలు ఏర్పడితే ఎదుర్కొనేందుకున్న సంసిద్ధతను పరీక్షించేందుకే ఈ ప్రత్యేక ట్రేడింగ్లను చేస్తున్నారు.
4.29 లక్షల కోట్లు..
మార్కెట్ ర్యాలీతో బీఎస్ఈ నమోదిత సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన మదుపరుల సంపద ఈ ఒక్కరోజే రూ.4.29 లక్షల కోట్లు పెరిగింది. రూ.4,29,339.75 కోట్లు అందుకుని బీఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.3,92,25,029.98 కోట్ల (4.78 ట్రిలియన్ డాలర్లు)కు చేరింది. ఇక విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్ఐఐ) గురువారం రూ.3,568.11 కోట్ల పెట్టుబడులను పెట్టినట్టు స్టాక్ ఎక్సేంజీ వర్గాలు తెలిపాయి.