Hindenburg Research | హిండెన్బర్గ్ (Hindenburg Research).. ఓ అమెరికా షార్ట్ షెల్లింగ్ సంస్థ.. ఈ సంస్థ ఇచ్చిన నివేదిక దేశీయ స్టాక్ మార్కెట్లను షేక్ చేస్తున్నది. భారత్లోనే అత్యంత కుబేరుడు.. ప్రపంచ బిలియనీర్లలో ఒకరైన గౌతం అదానీ ఆధ్వర్యంలోని అదానీ గ్రూప్ వ్యాపార లావాదేవీలు, స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్, ఆ సంస్థల రుణ భారంపై గత వారం వెలువరించిన నివేదిక దేశీయ మార్కెట్లలో.. ప్రత్యేకించి విదేశీ, స్వదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను బలహీన పరిచింది. ఇన్వెస్టర్లు అదానీ గ్రూప్ సంస్థల్లో వాటాలను విక్రయించడంతో ఆ గ్రూప్ మూడు రోజుల్లో రమారమీ 72 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయింది.. అసలు ఈ హిండెన్బర్గ్ రీసెర్చ్ సంస్థ నేపథ్యం ఏమిటి.. దీని యజమాని నాథన్ ఆండర్సన్ ఎవరు.. ఆయన ఎక్కడ నుంచి వచ్చారు.. ఏం చేస్తున్నారు.. తెలుసుకుందామా..!
హిండెన్ బర్గ్ రీసెర్చ్ (Hindenburg Research) సంస్థను నాథన్ అండర్సన్ (Nathan Anderson) అనే 38 ఏండ్ల కుర్రాడు నడుపుతున్నారు. అమెరికాలోని న్యూయార్క్ కేంద్రంగా పని చేస్తున్న హిండెన్బర్గ్ను 2017లో స్థాపించారు. మానవ నిర్మిత విపత్తుల సంగతి నిగ్గు తేల్చడమే ధ్యేయంగా దీని కార్యకలాపాలు సాగుతాయి. ఫైనాన్సియల్ సేవలపై ఫోరెన్సిక్ రీసెర్చ్ సేవలు అందిస్తున్నది. వివిధ కార్పొరేట్ సంస్థల్లో మోసాలు, నిబంధనల ఉల్లంఘనతో అవకాశాల దుర్వినియోగం, రహస్య లావాదేవీలు తదితర ఫ్రాడ్ల సంగతి క్షుణ్ణంగా అధ్యయనం చేసి నివేదిక విడుదల చేస్తూ ఉంటుంది. మోసాలకు పాల్పడిన కంపెనీలు లక్ష్యంగా చేసుకుంటుంది. షార్ట్ షెల్లింగ్తో సవాళ్లు విసురుతుంది.
స్టాక్ మార్కెట్ అంటే రోజువారీ ట్రేడింగ్ మాత్రమే కాదు పలు రకాల ట్రేడింగ్స్ జరుగుతాయి. ముందుగా షేర్లు కొని వాటి ధర పెరిగా అమ్మేయడం. ఇంట్రాడే, డెలివరీ అనే రెండు పద్దతుల్లో చేస్తారు. షేర్ల ధర ఎక్కువగా ఉన్నప్పుడు విక్రయించడం.. భారీగా పతనం అయ్యాక కొనుగోలు చేసి ట్రేడింగ్ ముగించి లాభాలు పొందడమే సార్ట్ షెల్లింగ్ అని అంటారు. ఇదే పని హిండెన్బర్గ్ చేస్తూ ఉంటుంది. అదానీ గ్రూప్పై మాదిరిగా నివేదికలు బహిర్గతం చేయడానికి ముందు ఆయా సంస్థల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఆ సంస్థల షేర్లు కొనుగోలు చేస్తుందన్న మాట. ఆ సంస్థలపై నివేదిక బహిర్గతం చేస్తూనే తాను కొనుగోలు చేసిన షేర్లు విక్రయించి లాభాలు గడిస్తుంది..
నాథన్ అండర్సన్ సారధ్యంలోని ఈ హిండెన్బర్గ్.. తన టార్గెట్గా ఉన్న కంపెనీకి సంబంధించిన పబ్లిక్ రికార్డులు, ఇంటర్నల్ కార్పొరేట్ రికార్డులు, పత్రాలు ఒక ఆరు నెలల పాటు సేకరిస్తుంది.. ఆ పత్రాలను విశ్లేషించుకుంటుంది. తాజాగా ఆ కంపెనీలో పని చేస్తున్న, మాజీ ఉద్యోగులతో సంప్రదిస్తుంది. వివిధ దేశాల్లో తిరిగి డేటా సేకరించి.. సవివరమైన నివేదిక రూపొందిస్తుంది. అటుపై షార్ట్ సెల్లింగ్కు అవకాశం చూసుకుని ఆ నివేదిక బహిర్గతం చేసి లాభాలు పొందుతుంది.
దాదాపు మూడేండ్ల క్రితం.. అంటే ప్రపంచాన్ని కరోనా చుట్టుముడుతున్న వేళ 2020లో అమెరికాలోని నికోలా కార్పొరేషన్నూ ఇలాగే హిండెన్బర్గ్ లక్ష్యంగా చేసుకుని నివేదిక విడుదల చేసింది. నికోలా కార్పొరేషన్లో మోసం బయటి ప్రపంచానికి వెల్లడి కావడంతో ఆ సంస్థ షేర్ దాదాపు 40 శాతం నష్టపోయింది. అమెరికా స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ `ఎస్ఈసీ` దర్యాప్తులోనూ నికోలా కార్పొరేషన్లో ఫ్రాడ్ జరిగిందని గుర్తించింది. 2017లో స్థాపించినప్పటి నుంచి హిండెన్బర్గ్ ఇప్పటి వరకు 16 కంపెనీల లావాదేవీలపై దర్యాప్తు జరిపింది.
హిండెన్బర్గ్ రీసెర్చ్ వ్యవస్థాపకుడు నాథన్ అండర్సన్ వ్యక్తిగత డేటా బయటికి రాదు. కనెక్టివిటీ యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ బిజినెస్ కోర్సు పూర్తి చేశాడు. అటుపై ఇజ్రాయెల్లో కొన్నేండ్ల పాటు అంబులెన్స్ డ్రైవర్గా జీవనం సాగించాడు. అటుపై అమెరికాలోని ఒక డేటా కంపెనీ.. ఫ్యాక్ట్ సెట్ రీసెర్చ్ సిస్టమ్స్లో పని చేశాడు. ఏ కంపెనీలో పని చేసినా.. ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ వ్యవహారాలు నెరిపేవాడు. ఎటువంటి ఒత్తిడిలోనైనా ఎలా పని చేయాలో నేర్చుకున్నానని ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.
హిండెన్బర్గ్ అనేది జర్మనీలోని ఒక ప్యాసింజర్ ఎయిర్షిప్ పేరు. 1937లో జరిగిన ప్రమాదంలో ఈ హిండెన్బర్గ్ ఎయిర్షిప్ దెబ్బతినడంతో 35 మంది మరణించారు. మానవుడి నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని నాథన్ అండర్సన్ చెప్పాడు. అందుకే తన సంస్థకు హిండెన్ బర్గ్ అనే పేరు పెట్టానని తెలిపాడు.