ITR E-Verification | ప్రతి వేతన జీవి తన ఆదాయంపై ప్రతియేటా ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తారు. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ఇన్కం టాక్స్ డిపార్ట్మెంట్ ఈ-ఫైలింగ్ పోర్టల్లో సకాలంలో ఐటీ రిటర్న్స్ దాఖలు చేసినా.. దాని ఈ-వెరిఫికేషన్ ప్రక్రియ మాత్రం మరిచిపోయారు. ఆదాయం పన్ను చట్టం నిబంధనల ప్రకారం ఐటీఆర్ ఫైల్ చేసిన వారంతా 30 రోజుల్లో తమ రిటర్న్స్ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ సదరు వ్యక్తి తన ఐటీఆర్ వెరిఫై చేసుకోకుంటే.. ఆ రిటర్న్స్ ప్రాసెసింగ్లోకి తీసుకోరు. అంతే కాదు టాక్స్ రీఫండ్ కాకపోవచ్చు.
ఐటీఆర్ ఫైల్ చేసిన తర్వాత ఐటీఆర్ వెరిఫికేషన్ ప్రక్రియ చాలా సింపుల్గా ఉంటుంది. ఆన్లైన్లో కొన్ని నిమిషాల్లో ఐటీఆర్ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. ఈ నెల 23 వరకు 31 లక్షల మందికి పైగా ఐటీఆర్ దాఖలు చేసిన వేతన జీవులు తమ ఐటీఆర్లను వెరిఫికేషన్ చేసుకోలేకపోయారు.
ఇన్కం టాక్స్ వెబ్సైట్ ప్రకారం ఈ నెల 23 నాటికి 6.91 కోట్ల మందికి పైగా ఐటీఆర్లు దాఖలైనా.. 6.59 కోట్ల ఐటీఆర్లు మాత్రమే వెరిఫై అయ్యాయి. అంటే దాదాపు 33.2 లక్షల మంది ఐటీఆర్ ఈ-వెరిఫికేషన్ పూర్తి చేసుకోలేదు. 30- రోజుల ఈ-వెరిఫికేషన్ ప్రక్రియ కూడా ముగిసిపోతుంది. ఈ నేపథ్యంలో వేతన జీవులు, పన్ను చెల్లింపుదారులు తమ ఐటీఆర్లు వెరిఫై చేసుకోవాలని ‘ఎక్స్’ ప్లాట్ఫామ్ (మాజీ ట్విట్టర్) లో ఆదాయం పన్ను విభాగం అలర్ట్ చేసింది.
పన్ను చెల్లింపుదారులు తక్షణం ఐటీఆర్ ఈ-వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలని హెచ్చరించింది. సకాలంలో ఐటీఆర్ ఈ-వెరిఫికేషన్ పూర్తి చేయకపోతే రీఫండ్స్ ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది. అంతే కాదు.. సదరు ఐటీఆర్లను ఇన్వాల్యూడ్గా పరిగణించవచ్చు. ఈ-వెరిఫికేషన్ ఆలస్యం కావడంతో ఆదాయం పన్ను చట్టం ప్రకారం పెనాల్టీ పే చేయాల్సి ఉంటుంది.
వేతన జీవులు ‘Income Tax E-filing’ పోర్టల్ లోకి వెళ్లి లాగిన్ కావాలి. ‘E-Verify Return’ ఆప్షన్ ఎంచుకోవాలి. మీ ఆధార్’ కి లింక్ అయిన మొబైల్ నంబర్ కి వచ్చిన ఓటీపీ నమోదు చేస్తే ఐటీఈర్ ఈ-వెరిఫికేషన్ పూర్తవుతుంది.