Goldman Sachs | అమెరికాకు చెందిన ప్రముఖ మల్టీ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అండ్ ఫైనాన్సియల్ సర్వీసెస్ సంస్థ గోల్డ్మాన్ సాచెస్.. 3000 మంది ఉద్యోగులను ఇంటికి పంపేసింది. న్యూయార్క్లోని కంపెనీ హెడ్ క్వార్టర్స్లో సీఈవో డేవిడ్ సాల్మన్తో ఉదయం 7.30 గంటలకు సమావేశం ఏర్పాటు చేసింది గోల్డ్మాన్ సాచెస్. ఈ సమావేశం కోసం సంస్థ కాన్ఫరెన్స్ హాలులోకి వచ్చిన సిబ్బందిని వారి విభాగం అధిపతులు పలకరించారు. అటుపై ఉద్వాసనకు గురైన ఉద్యోగుల జాబితాను ప్రకటించారు. అలా ఉద్వాసనకు గురైన వారికి క్షమాపణలు కూడా చెప్పారు. బలవంతంగా తొలగించాల్సి వచ్చిందంటూ.. వారికి బెస్టాఫ్ లక్ చెప్పారని న్యూయార్క్ పోస్ట్ ఓ వార్తా కథనం ప్రచురించింది.
ఆసియా-పసిఫిక్ రీజియన్ పరిధిలోని ఉద్యోగులందరినీ ఉదయం 7.30 గంటలకే సమావేశానికి రావాలని కంపెనీ యాజమాన్యం హుకూం జారీ చేసింది. మిగతా రీజియన్ల పరిధిలోని ఉద్యోగుల డ్యూటీ వేళలు వేరని, వారెవ్వరినీ సమావేశం గురించి ఆరా తీయొద్దని కూడా సూచించింది. ఉద్వాసనకు గురైన వారంతా తక్షణం ఆఫీసు నుంచి వెళ్లిపోవాలని పేర్కొంది. ఉదయం తొమ్మిది గంటలకు ఉద్వాసనకు గురైన వారంతా వెళ్లిపోయారు. తమ సహచర ఉద్యోగులను కూడా కలుసుకోకుండానే నిష్క్రమించారని సమాచారం.
సంస్థ గ్లోబల్ హెడ్ ఆఫ్ కమ్యూనికేషన్స్ టోనీ ఫ్రాట్టో ఈ మేరకు ఒక ప్రకటన చేస్తూ `సంస్థను వీడుతున్న ఉద్యోగులకు కష్టకాలం అని మాకు తెలుసు. సంస్థకు వారందించిన సేవలకు ధన్యవాదాలు. వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు మేం సిద్ధం` అని తెలిపారు. ఈ నెల ప్రారంభంలోనే సంస్థలో 6.5 శాతం.. అంటే 3,200 మందికి పైగా ఉద్యోగులను గోల్డ్మాన్ సాచెస్ తొలగించనున్నదని వార్తలు వచ్చాయి.