న్యూఢిల్లీ, జనవరి 20: బంగారం ధరలు పెరిగాయి. శుక్రవారం ఢిల్లీలో 10 గ్రాముల ధర రూ.433 ఎగిసి రూ. 57,025ను తాకింది. హైదరాబాద్లోనూ రూ.380 ఎగబాకి రూ.57,110ని చేరిం ది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల పుత్తడి తులం రేటు హైదరాబాద్లో గురువారంతో పోల్చితే రూ.350 పుంజుకొని రూ.52,350కి వెళ్లింది. వెండి ధరలు కూడా ఢిల్లీ మార్కెట్లో పరుగులు పెట్టాయి. కిలో ధర రూ.990 అందిపుచ్చుకొని రూ.69,208కి చేరింది. అయితే హైదరాబాద్లో మాత్రం రూ.1,400 దిగజారి రూ.72,100లుగా పలికింది.
అంతర్జాతీయ మార్కెట్లలో అటు బంగారం, ఇటు వెండి ధరలు పెరిగాయి. ఔన్సు పుత్తడి ధర 1,932 డాలర్లు, వెండి 24.02 డాలర్లు పలికాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ నిరాశాజనకంగా ఉండటం, ఆర్థిక మాంద్యం భయాల మధ్య మదుపరులు బంగారంపై పెట్టుబడులకు ఆసక్తి కనబరుస్తున్నట్టు విశ్లేషకులు చెప్తున్నారు.