న్యూఢిల్లీ, డిసెంబర్ 5: బంగారం ధరల పెరుగుదలకు బ్రేక్పడింది. గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో దూసుకుపోయిన పసిడికి అంతర్జాతీయ మార్కెట్లు బ్రేక్వేశాయి. గ్లోబల్ మార్కెట్లో డిమాండ్ పడిపోవడం, ఈక్విటీ మార్కెట్లు భారీగా పుంజుకుంటుండటంతో పెట్టుబడిదారులు తమ ఇన్వెస్ట్మెంట్లను పసిడి నుంచి ఇతర వాటికి మళ్లించడంతో దేశీయంగా బంగారం ధర వెయ్యి రూపాయల వరకు దిగొచ్చింది. ఢిల్లీలో అయితే తులం బంగారం ధర రూ.1,050 తగ్గి రూ.63,250కి దిగొచ్చింది. అంతకుముందు రోజు ధర రూ.64,300గా ఉన్నది. పసిడితోపాటు వెండి భారీగా తగ్గింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు నిలిచిపోవడంతో కిలో వెండి ధర ఏకంగా రూ.1,700 తగ్గి రూ.78,500కి జారుకున్నది.
మరోవైపు, హైదరాబాద్లో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,090 దిగి రూ.63,110కి చేరుకున్నది. అలాగే 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,000 తగ్గి రూ.57,850 దిగొచ్చింది. రూ.2,100 తగ్గిన కిలో వెండి రూ.81,400 వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్లో బేరిష్ ట్రెండ్ కొనసాగడం వల్లనే దేశీయంగా ధరలు దిగొచ్చాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ సీనియర్ ఉన్నతాధికారి సామ్యూల్ గాంధీ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 2,037 డాలర్లకు, వెండి 24.50 డాలర్ల వద్ద ఉన్నది.