న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: జీఎస్టీ వసూళ్ళు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. గత ఆర్థిక సంవత్సరం చివరి నెలలో ఏకంగా రూ.1.23 లక్షల కోట్ల మేర వసూలైనట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. అంతక్రితం ఏడాది వసూలైన దాంతో పోలిస్తే ఇది 27 శాతం అధికం. అలాగే జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఒక నెలలో ఇంతటి స్థాయిలో పన్ను వసూలవడం కూడా ఇదే తొలిసారి కావడం గమనార్హం. గడిచిన ఆరు నెలలుగా లక్ష కోట్ల రూపాయలకు పైగా జీఎస్టీ వసూలవుతున్నదని, కరోనా తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకున్నదన్నడానికి ఈ పన్ను వసూళ్లే నిదర్శణమని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత నెలలో వసూలైన రూ. 1,23,902 కోట్లలో సెంట్రల్ జీఎస్టీ కింద రూ. 22,973 కోట్లు, స్టేట్ జీఎస్టీ కింద రూ.29,329 కో ట్లు, ఐజీఎస్టీ కిం ద రూ.62,842 కోట్లు, సెస్ రూపం లో రూ.8,757 కోట్లు వసూలైనట్లు వెల్లడించింది.
తెలంగాణలో రూ.4,166.42 కోట్ల మేర జీఎస్టీ వసూలైనట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఏడాది క్రితం ఇదే నెలలో వసూలైన రూ.3,562.56 కోట్లతో పోలిస్తే ఇది 17 శాతం అధికం. అలాగే ఏపీలో రూ.2,685.09 కోట్లు వసూలయ్యాయి.