ముంబై, మే 4: దేశీయ స్టాక్ మార్కెట్లు రివ్వున ఎగిశాయి. విదేశీ పెట్టుబడిదారుల నిధుల ప్రవాహం కొనసాగుతుండటంతోపాటు బ్లూచిప్ సంస్థలైన హెచ్డీఎఫ్సీ ద్వయం, రిలయన్స్ ఇండస్ట్రీ షేర్లకు లభించిన మద్దుతో సూచీలు కదం తొక్కాయి. ఇంట్రాడేలో 600 పాయింట్లకు పైగా లాభపడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 555.95 పాయింట్లు ఎగబాకి 61,749.25 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 165.95 పాయింట్లు అందుకొని 18,255.80 పాయింట్ల వద్ద స్థిరపడింది. భవిష్యత్తులో అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను పెంచే అవకాశాలు లేవని సంకేతాలు ఇవ్వడంతో పెట్టుబడిదారులు ఎగబడి కొనుగోళ్లు జరిపారు.
బజాజ్ ఫైనాన్స్ 3 శాతానికి పైగా పెరిగి టాప్ గెయినర్గా నిలిచింది. దీంతోపాటు హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, ఏషియన్ పెయింట్స్, ఎస్బీఐ, టీసీఎస్, భారతీ ఎయిర్టెల్, రిలయన్స్, టాటా స్టీల్, సన్ఫార్మాలు ఒక్క శాతానికి పైగా పెరిగాయి.
కొటక్ బ్యాంక్, హెచ్యూఎల్, హెచ్సీఎల్ టెక్, యాక్సిస్ బ్యాంక్, టైటాన్, టెక్మహీంద్రా, ఇన్ఫోసిస్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎన్టీపీసీ, మారుతి, ఎల్అండ్టీలు అధికమయ్యాయి.