న్యూఢిల్లీ, మార్చి 27: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాను ప్రైవేటీకరించేందుకు నరేంద్ర మోదీ సర్కార్ వేగంగా పావులు కదుపుతున్నది. ఈ ప్రక్రియ ఈ ఏడాది మే చివరి నాటికి పూర్తికావచ్చని పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి శనివారం తెలిపారు. ఎయిర్ ఇండియా అమ్మకానికి సంబంధించిన ఆర్థిక బిడ్లను 64 రోజుల్లోగా క్లోజ్ చేయాలని సోమవారం జరిగిన సమావేశంలో ప్రభుత్వం నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ సంస్థను కొనుగోలు చేసేందుకు పలువురు బిడ్డర్లు ఆసక్తి చూపుతున్నారని, వీరిలో కొందరిని ఇప్పటికే షార్ట్లిస్ట్ చేశామని స్పష్టం చేశారు. ఇప్పటికీ ఎయిర్ ఇండియా రూ.60 వేల కోట్ల అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నదని, అమ్మకానికి ఆ సంస్థ అర్హమైనదేనని పేర్కొన్నారు. ఎయిర్ ఇండియాతోపాటు పవన్ హన్స్ లాంటి ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు కూడా కసరత్తు జరుగుతున్నదని హర్దీప్ సింగ్ పురి చెప్పారు.