న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: భారత్లో పసిడికి డిమాండ్ అంతకంతకు పెరుగుతున్నది. గరిష్ఠ స్థాయిలో ధరలు కొనసాగుతున్నప్పటికీ కొనుగోళ్లు మాత్రం ఆగడం లేదు. ప్రస్తుత సంవత్సరంలో దేశీయంగా 900 టన్నుల పసిడికి డిమాండ్ ఉంటుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఇండియా ఎండీ సోమసుందరం తాజాగా వెల్లడించారు. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో డిమాండ్ అంతంత మాత్రమే ఉన్నప్పటికీ, రెండో సగభాగంలో బంగారం అమ్మకాలు ఊపందుకునే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. 2023లో 745.7 టన్నుల విలువైన పసిడి విక్రయాలు జరిగాయి. అంతక్రితం ఏడాదితో పోలిస్తే 3 శాతం తగ్గింది. పుత్తడి ధరలు రికార్డు స్థాయికి చేరుకోవడం
గడిచిన ఐదేండ్లుగా భారత్లో పసిడి అమ్మకాలు 700 టన్నుల నుంచి 800 టన్నుల స్థాయిలోనే నమోదవుతున్నాయి. కానీ, ఈ ఏడాది మాత్రం 800-900 టన్నుల స్థాయికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పారు. దేశ ఆర్థిక రంగం పరుగులు పెడుతుండటం, అధిక ఆదాయ వనరులు సమకూరుతుండటం ఇందుకు కారణమని ఆయన చెప్పారు. ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురిసే అవకాశాలుండటంతో డిమాండ్ మరింత పెరగడానికి దోహదపడనున్నదన్నారు. ఈ ఏడాది సాదరణ ఎన్నికలు జరుగుతుండటంతో పుత్తడికి డిమాండ్ పెరిగేందుకు ఆస్కారం ఉన్నదని పేర్కొన్నారు. స్విట్జర్లాండ్, యూఏఈ, పెరూ, ఘనా దేశాల నుంచి భారత్ అత్యధికంగా పసిడి దిగుమతి చేసుకుంటున్నది. ప్రస్తుతం దేశీయంగా ధరలు తగ్గుముఖం పట్టాయని, దీంతో ఈ ఏడాది మరో 100 టన్నులు పెరిగేందుకు ఆస్కారం ఉన్నదని పేర్కొన్నారు. అంతర్జాతీయ దేశాలు అనిశ్చిత పరిస్థితి నెలకొనడంతో 2023లో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే.
ఈ ఏడాది ద్వితీయార్థంలో పలు సెంట్రల్ బ్యాంకులు వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలుండటంతో పుత్తడికి డిమాండ్ పెరిగేందుకు అవకాశాలున్నాయని పేర్కొన్నారు. 2022లో రూ.52 వేల నుంచి రూ.53 వేల స్థాయిలో కదలాడిన బంగారం 2023లో రికార్డు స్థాయి రూ.65 వేల మార్క్ను అధిగమించింది. మరోవైపు, అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో పసిడి వినిమయం 4 శాతం తగ్గి 266.2 టన్నులకు పడిపోయింది.