ముంబై, డిసెంబర్ 28: అంతర్జాతీయ ట్రెండ్ సానుకూలత, దేశీయ ఆర్థిక ఫండమెంటల్స్ బలపడుతున్న సంకేతాలతో భారత స్టాక్ మార్కెట్ రికార్డుల పరంపర కొనసాగుతున్నది. వరుసగా ఐదో రోజూ బలమైన ర్యాలీ జరిగింది. డిసెంబర్ డెరివేటివ్ సిరీస్కు గురువారం ముగింపు రోజైనప్పటికీ, స్టాక్ సూచీలు ఏ మాత్రం ఒడిదుడుకులకు లోనుకాకుండా సరికొత్త రికార్డుస్థాయిల్ని నెలకొల్పాయి. బీఎస్ఈ సెన్సెక్స్ మరో 372పాయింట్లు జతచేసి 72,410 పాయింట్ల వద్ద ముగిసింది. ఇదేబాటలో ఎన్ఎస్ఈ నిఫ్టీ 21,700, 21,800 పాయింట్లస్థాయిల్ని మొదటిసారిగా దాటేసింది. 124 పాయింట్ల లాభంతో 21,778 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ సూచి 21,801 పాయింట్ల వద్ద కొత్త రికార్డును సృష్టించింది. ఐదు ట్రేడింగ్ రోజుల్లో సెన్సెక్స్ 1,904 పాయింట్లు, నిఫ్టీ 628 పాయింట్ల చొప్పున లాభపడ్డాయి. ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధర 78 డాలర్లస్థాయికి తగ్గడంతో పాటు అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లు జరిపారని విశ్లేషకులు చెప్పారు.
డిసెంబర్ డెరివేటివ్ కాంట్రాక్టుల్ని జనవరికి రోలోవర్ చేసే సందర్భంలో ఇన్వెస్టర్లు బుల్లిష్ బెట్స్ తీసుకున్నట్టు కన్పిస్తున్నదని, ఈ నేపథ్యంలో కొత్త ఏడాదిలో సైతం అప్ట్రెండ్ కొనసాగవచ్చని మెహతా ఈక్విటీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ తాప్సే చెప్పారు. ద్రవ్యోల్బణంపై ఆందోళన తగ్గడం, అమెరికా ఫెడ్ తొందర్లోనే వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న అంచనాల కారణంగా భారత్ ఆర్థిక వ్యవస్థ ఊపందుకుంటుదని ఇన్వెస్టర్లు విశ్వసిస్తున్నారని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈక్విటీ ర్యాలీ లో వెనుకబడ్డ చైనా, హాంకాంగ్ సూచీలు గురువారం భారీగా పెరిగాయి. చైనా షాంఘై ఇండెక్స్, హాంకాంగ్ హాంగ్సెంగ్ ఇండెక్స్లు 2.7 శాతం వరకూ ర్యాలీ చేశాయి. కొరియా కోస్పి ఇండెక్స్ 1.7 శాతం జంప్చేసింది.
సెన్సెక్స్ షేర్లలో అన్నింటికంటే అధికంగా మహీంద్రా అండ్ మహీంద్రా 2.81 శాతం పెరిగింది. ఎన్టీపీసీ, పవర్గ్రిడ్, నెస్లే, టాటా మోటార్స్, ఐటీసీ, భారతి ఎయిర్టెల్, కొటక్ మహీంద్రా బ్యాంక్లు 1-2.5 శాతం మధ్య ర్యాలీ జరిపాయి. మరోవైపు ఎల్ అండ్ టీ, విప్రో, జేఎస్డబ్ల్యూ స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్, ఏషియన్ పెయింట్స్ స్వల్పంగా నష్టపోయాయి. బ్లూచిప్స్తో పాటు మిడ్, స్మాల్క్యాప్ షేర్లకు సైతం పెరిగాయి. బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ 0.66 శాతం బీఎస్ఈ స్మాల్క్యాప్ ఇండెక్స్ 0. 23 శాతం చొప్పున పెరిగాయి.వివిధ రంగాల సూచీల్లో అధికంగా ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ 2.45 శాతం ఎగిసింది. ఎనర్జీ ఇండెక్స్ 2.18 శాతం మెటల్ ఇండెక్స్ 1.6 శాతం చొప్పున ర్యాలీ చేశాయి. ఎఫ్ఎంసీజీ సూచి 1.24 శాతం, రియల్టీ ఇండెక్స్ 0.97 శాతం, పవర్ ఇండెక్స్ 0.95 శాతం మేర పెరిగాయి. ఇండస్ట్రియల్, ఐటీ సూచీలు నష్టపోయాయి.
వరుసగా ఐదు ట్రేడింగ్ రోజుల్లో జరిగిన మార్కెట్ ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపద భారీగా రూ.12.80లక్షల కోట్ల మేర పెరిగింది. బీఎస్ఈలో లిస్టయిన మొత్తం కంపెనీల మార్కెట్ విలువ గత గురువారం నుంచి ఈ బుధవారం వరకూ రూ.12,80,599 కోట్లు పెరిగి ఆల్టైమ్ రికార్డుస్థాయి రూ.3,63,00,558 కోట్లకు చేరింది.