ముంబై, జూన్ 17: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2022-23)గాను తొలి విడత సావరిన్ గోల్డ్ బాండ్ స్కీం ఇష్యూ ధరను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిర్ణయించింది. గ్రాము బంగారం రూ.5,091గా ఉన్నట్టు శుక్రవారం ఓ ప్రకటనలో తెలియజేసింది. సోమవారం మొదలుకానున్న సబ్స్క్రిప్షన్.. ఐదు రోజులపాటు (20-24 తేదీల్లో) సాగనున్నది. కాగా, కేంద్ర ప్రభుత్వం గ్రాముపై రూ.50 రాయితీని ప్రకటించింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని, డిజిటల్ విధానంలో చెల్లించిన వారికి ఈ డిస్కౌంట్ దక్కనున్నది. వీరందరికి గ్రాము రూ.5,041కే లభిస్తుంది. భారత ప్రభుత్వం తరఫున ఈ బాండ్లను ఆర్బీఐ జారీ చేస్తుందన్న విషయం తెలిసిందే. నివాసితులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు, ట్రస్టులు, విశ్వవిద్యాలయాలు, చారిటబుల్ సంస్థలకే వీటిని విక్రయిస్తారు. ఎనిమిదేండ్ల కాలపరిమితి కలిగిన ఈ బాండ్లను ఐదేండ్ల తర్వాతనే సొమ్ము చేసుకునే వీలున్నది. వ్యక్తులు, హెచ్యూఎఫ్లకు 4 కిలోలదాకా, ట్రస్టులు తదితర సంస్థలకు 20 కిలోల వరకు పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉన్నది.