ఎండీ విక్రమ్ లిమయే
ముంబై, మార్చి 9: చాలా ప్రభుత్వ రంగ సంస్థలు, రెగ్యులేటరీ ఏజెన్సీలు, బ్యాంక్ల చైర్మన్లు, ఎండీలు, సీఈవోలు వీలైనంతకాలం పదవిలో కొనసాగాలని కోరుకుంటారు. రెండో టెర్మ్, మూడో టెర్మ్ పునర్నియామకానికి పలు ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) ప్రస్తుత ఎండీ, సీఈవో విక్రమ్ లిమయే మాత్రం మరో టెర్మ్ వద్దంటున్నారు. ఆయన ఐదేండ్ల పదవీకాలం ఈ ఏడాది జూలైలో ముగియనుంది. స్టాక్ ఎక్సేంజ్లో పారదర్శకత లోపించడం, కో లొకేషన్ అవకతవకలపై ప్రస్తుత ఎన్ఎస్ఈపై నియంత్రణా సంస్థల దర్యాప్తు జరుపుతున్న నేపథ్యంలో లిమయే తన నిర్ణయాన్ని తాజాగా వెల్లడించారు.
‘రెండో టెర్మ్ కొనసాగాలన్న ఆసక్తి లేదని ఇప్పటికే డైరెక్టర్ల బోర్డ్కు తెలిపా. ఎండీ, సీఈవో ఎంపిక కోసం జరుగుతున్న ప్రక్రియలో పాల్గొనను. దరఖాస్తు కూడా చేయను. నా పదవీ కాలం 2022 జూలై 16న ముగుస్తుంది’ అంటూ బుధవారం విక్రమ్ లిమయే ఒక ప్రకటన విడుదల చేశారు. క్లిష్ట సమయంలో నేతృత్వం వహించి, సంస్థను స్థిరపర్చడానికి, పటిష్టంచేయడానికి, మార్చేందుకు ఉత్తమరీతిలో పనిచేశానని తెలిపారు. గవర్నెన్స్, టెక్నాలజీ, రెగ్యులేటరీ సామర్థ్యం, వ్యాపార వృద్ధికి తాము ఎంతో కృషిచేశామన్నారు. ఎండీ, సీఈవో పోస్టుకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఎన్ఎస్ఈ ఇటీవల దరఖాస్తుల్ని ఆహ్వానించింది. ఐపీవోల్లో అనుభవం కలిగిన అభ్యర్థులు ఈ నెల 25లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరింది. మార్కెట్ రెగ్యులేటర్ సెబీ నిబంధనల ప్రకారం లిమయే మరో టెర్మ్ పదవి చేపట్టడానికి అర్హులు. అయితే తదుపరి టెర్మ్లో పునర్నియామకం జరగాలంటే ఆయన ఇతర అభ్యర్థులతో పోటీపడాల్సి ఉం టుంది. ఎన్ఎస్ఈలో చేరకముందు లిమయే.. ఐడీఎఫ్సీ ఎండీ, సీఈవోగా పనిచేశారు. పలు ఆరోపణల నేపథ్యంలో ఇటీవల అరెస్టయిన చిత్రా రామకృష్ణను 2013లో ఎన్ఎస్ఈ ఎండీ, సీఈవోగా నియమించినపుడు ఆ పోస్టుకు దరఖాస్తుల్ని ఎందుకు ఆహ్వానించలేదంటూ ఇటీవల విమర్శలు వెల్లువెత్తాయి.