మాతృత్వం ఓ వరం. బిడ్డ ఒడిలో పడగానే తల్లి పొందే ఆనందాన్ని మాటల్లో వర్ణించలేం. మాతృత్వం ఓ సవాలు. ఆ తొమ్మిది నెలలూ అనేక సమస్యలు ఎదుర్కొంటారు. చిరునవ్వుతో అధిగమిస్తారు కూడా. అలానే, ప్రసూతి తర్వాత ఇబ్బందిపెట్టే చర్మ సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. ప్రెగ్నెన్సీ సమయంలో సెబాసియస్ గ్రంథులు మరింత చైతన్యం అవుతాయి. దీంతో చర్మంపై మొటిమల్లాంటివి పుట్టుకొస్తాయి. ఒంట్లో తేమ తగ్గిపోయి, చర్మం పొడిబారుతుంది. కొందరిని జిడ్డు చర్మం వేధిస్తుంది. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత చర్మం సహజంగానే వదులుగా మారిపోతుంది. పొట్టచుట్టూ, తొడల దగ్గర ప్రసూతి ముడతలు ప్రత్యక్షం అవుతాయి. మొహం మీద మచ్చలూ కనిపించవచ్చు. ఈ సమస్యలకు తగిన పరిష్కారాలూ ఉన్నాయి. చర్మవైద్యులను సంప్రదిస్తే.. ఔషధాలు, పైపూత మందులు ఇస్తారు. కాకపోతే, పిల్లలకు చనుబాలు ఇవ్వడానికి ముందు ఆ క్రీమ్లను శుభ్రం చేసుకోవడం ఉత్తమం. క్రీమ్ రాసుకున్న చేతులతో పిల్లలకు ఏదైనా తినిపించడమూ ప్రమాదకరమే. ముఖ్యంగా స్టెరాయిడ్స్ జోడించిన క్రీమ్లను ఛాతీకి పూసుకున్న సమయంలో పాలివ్వకపోవడమే మంచిది. కొందరికి కొన్ని మందులు పడకపోవచ్చు. ఈ విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. తల్లి అనారోగ్యం బిడ్డలనూ ప్రభావితం చేస్తుంది.