హ్యాట్సాఫ్.. నర్సులు
కరోనా విషమ పరిస్థితుల్లో అమూల్య సేవలు
కుటుంబాలకు దూరంగా విధులు
నేడు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం
విద్యానగర్, మే 11:నర్సులు.. సేవా మూర్తులు. కరోనాతో ప్రపంచమే అతలాకుతలమైపోతున్న ఈ రోజుల్లో తమ ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్న ధీరవనితలు. కుటుంబాలకు దూరంగా ఉంటూ.. రోగులే తమ పిల్లలుగా భావిస్తూ అహోరాత్రులు శ్రమిస్తున్న చల్లని దేవతలు. కాలిన గాయాలతో దవాఖానలకు వచ్చే బాధితులైనా.. రోడ్డు ప్రమాద క్షత గాత్రులైనా.. పురిటినొప్పులతో వచ్చే గర్భిణులైనా.. మరింకెవరైనా తోబుట్టువుల్లా మొదట పలుకరించేది వాళ్లే. అలాంటి సిస్టర్స్కు ప్రపంచ నర్సుల దినోత్సవం సందర్భంగా సమాజం సెల్యూట్ చేస్తున్నది.
ప్రాణాలకు తెగించి సేవలు..
నర్సులు ఇన్నాళ్లు చేసిన సేవలు వేరు.. ఏడాదిన్నగా అందిస్తున్న సేవలు వేరు. కరోనా కట్టడిలో వీళ్ల పాత్ర అమోఘమైనది. వారు అందిస్తున్న సేవలు అనిర్వచనీయమైనవి. తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా, కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ కొవిడ్ బాధితులకు సేవలందిస్తున్నారు. ఫ్లూయిడ్స్ అందించడం, రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు ఇవ్వడం, ఆక్సిజన్ పెట్టడం వంటి అనేక సపర్యలు చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానల్లో ఇప్పటికే 80 శాతం మంది కొవిడ్ బారిన పడ్డా.. కోలుకొని ఆత్మైస్థెర్యంతో మళ్లీ సేవలు అందిస్తున్నారు. ఈ మహమ్మారి బారిన పడి కొందరు సహచర నర్సులు ప్రాణాలు కోల్పోయినా ధైర్యం చెడకుండా సేవలందిస్తున్నారు. డాక్టర్లకు తలలో నాలుకలా వ్యవహరిస్తూ వారిచ్చే సూచనలు, సలహాలను తూచ తప్పక పాటిస్తూ ప్రాణాలు పోస్తూ చరిత్రలో నిలిచిపోయే సేవలందిస్తున్నారు.
నేడు అంతర్జాతీయ నర్సు డే..
నర్సింగ్ వృత్తికి హుందాతనాన్ని తెచ్చిన ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతిని పురస్కరించుకుని ప్రపంచ దేశాలన్నీ మే 12న అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి. ఆరోగ్య రక్షణలో నర్సులు అందించిన కృషిని తలుచుకుంటూ ఏటా ఈ రోజు వేడుకలు జరుపుకుంటున్నారు. అయితే కరోనా విపత్కర సమయంలో నర్సుల దినోత్సవానికి దూరంగా ఉండాలని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. రోగులకు సేవలు అందించడమే తమకు పెద్ద వేడుకగా చెప్పుకుంటున్నారు.
నర్సింగ్ ఆఫీసర్లుగా ప్రభుత్వం గుర్తింపు
ప్రజలకు వైద్య సేవలందిస్తున్న నర్సులను ప్రభుత్వం ఇటీవలే నర్సింగ్ ఆఫీసర్లుగా గుర్తించింది. నర్సింగ్ ఆఫీసర్లుగా పిలువాలని సూచించింది. దీంతో వారికి ప్రజల్లో గౌరవ హోదా లభించింది.
రాత్రింబవళ్లూ విధుల్లోనే
ఏడాది కాలంగా కరోనా విధులు వృత్తి మీదున్న బాధ్యతతో, రోగుల మీద ఉన్న కరుణతో సపర్యలు చేస్తూ మనో ధైర్యాన్ని అందిస్తున్నాం. జగిత్యాల ప్రభుత్వ దవాఖానకు రోజుకు వందల సంఖ్యలో పేషంట్లు వస్తున్నా అంకిత భావంతో పనిచేస్తున్నాం. రోగులకు మనోధైర్యం కల్పిస్తూ ముందుకుసాగుతున్నాం. కరోనా పరిస్థితుల్లో తాత్కాలికంగా నర్సింగ్ సిబ్బంది నియామకాలను సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉంది.