YS Sharmila | వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్లో చేరబోతున్నారని మరోసారి వార్తలు జోరందుకున్నాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఆమెను రాజకీయాల్లో కీలకంగా మార్చాలని కాంగ్రెస్ భావిస్తోందని.. అందుకే పీసీసీ చీఫ్గా బాధ్యతలు ఇవ్వాలని నిర్ణయించినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే వైఎస్ షర్మిల రేపు ( గురువారం ) ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. రేపు కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా షర్మిలను కాంగ్రెస్లో చేర్చుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే షర్మిల భర్త అనిల్ కుమార్ ఢిల్లీ చేరుకున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి పిలుపు రాగానే షర్మిల కూడా ఢిల్లీ బయల్దేరి వెళ్తారని సమాచారం.
వైఎస్ షర్మిలను ముందుంచి.. ఏపీ రాజకీయాల్లో లబ్ధి పొందాలని కాంగ్రెస్ భావిస్తోంది. కానీ ఏపీ పీసీసీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించేందుకు షర్మిల సుముఖంగా లేనట్లు కూడా తెలుస్తోంది. కాంగ్రెస్లో కొంతకాలం పనిచేసిన తర్వాత.. ఏపీ పీసీసీ బాధ్యతల గురించి ఆలోచిద్దామన్నట్లుగా షర్మిల ప్రతిపాదించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే పీసీసీ చీఫ్గా కాకుండా జాతీయ స్థాయిలో ఏఐసీసీలో సర్దుబాటు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది.