Perni Nani | ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ల వ్యవహారంతో రాజకీయాలు వేడెక్కాయి. అధికార వైఎస్సార్సీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నది. మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత పేర్ని నాని మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ హయాంలో ఎన్నడైనా ఒకటో తేదీన పెన్షన్లు ఇచ్చారా? అంటూ నిలదీశారు. చంద్రబాబు దొంగనాటకాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం నుంచి టీడీపీ నేతలు, అభ్యర్థులు సచివాలయాల వద్దకు పరుగులు తీస్తున్నారని.. ఐదేళ్లు అధికారంలో ఉన్న సమయంలో ఒక్కసారి కూడా వెళ్లలేదన్నారు. పెన్షన్లపై ఎన్నడూ లేని ప్రేమ చూపుతున్నారని విమర్శించారు.
అసలు పెన్షన్లను ఆపింది ఎవరంటూ ప్రశ్నించారు. వలంటీర్లు వద్ద బీజేపీ నాయకురాలు పురంధేశ్వరితో ఎన్నికల కమిషన్కు టీడీపీ లేఖ రాయించిందని ఆరోపించారు. యెల్లో వాచ్ అనే సంస్థ వలంటరీల వ్యవస్థపై కోర్టుకు వెళ్తున్నారని.. టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలతో ప్రతి పథకాలను పంచి పెట్టారని గుర్తు చేశారు. పసుపు కుంకుమ పేరుతో సహా ఏవైనా పథకాలను పంపిణీ చేస్తే తాము అడ్డుకున్నామా? అంటూ నిలదీశారు. పేదలపై సానుకూల దృక్పథంతో ఉన్న నేత వైఎస్ జగన్ మాత్రమేనన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, బీజేపీ.. జగన్ అధికారంలోకి వచ్చాక ఒక్క ప్రభుత్వ ఉద్యోగిని నియమించలేదని ఆరోపించారని.. సచివాలయాల్లో ఉద్యోగులను ఎవరు నియమించారని ప్రశ్నించారు.
నాలుగున్నరేళ్ల కిందట డిగ్రీ పూర్తి చేసిన 1.60లక్షల మందిని వలంటీర్లుగా జగన్ నియమించారన్నారు. పాపపు నోళ్లతోనే కూటమి నేతలు మళ్లీ ఇప్పుడు సచివాలయం సిబ్బందితో పెన్షన్లు పంపిణీ చేయాలంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్ల పాలన చూసి ఓటు వేస్తారా..? లేకపోతే రెండు నెలల పెన్షన్ చూసి ఓట్లేస్తారా? అని నాని నిలదీశారు. పసుపు కుంకుమ పంపిణీ చేస్తే జనం పచ్చడి చేశారంటూ తెలుగుదేశంపై సెటైర్లు వేశారు. వృద్ధులు సచివాలయానికి వెళ్లి పెన్షన్ తెచ్చుకునే పరిస్థితి ఉందా అంటూ మండిపడ్డారు. చంద్రబాబు వాలంటరీ వ్యవస్థపై బాబు విషం కక్కారని.. అడ్డమైన విమర్శలు చేశారన్నారు. వాలంటీర్ల వ్యవస్థ అంటే బాబుకు ఎందుకు భయం అంటూ ప్రశ్నించారు.