అమరావతి : వైసీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ప్లీనరీ సాక్షిగా కీలక ప్రకటన చేశారు. ఐదు సంవత్సరాలకొకసారి జరిగే ప్లీనరీ సమావేశంలో ఎవరూ ఊహించని విధంగా తాను వైసీపీ గౌరవ అధ్యక్ష స్థానం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. భవిష్యత్లో తనపై విమర్శలకు తావు లేకుండా ఉండడానికి ఈ నిర్ణయం తీసుకున్నానని ఆమె ప్రకటించారు. గుంటూరు జిల్లా చినకాకానిలో జరుగుతున్న వైసీపీ మూడవ ప్లీనరీ సమావేశంలో ఆమె సుదీర్ఘంగా మాట్లాడారు.
వైసీపీ పార్టీ పెట్టడానికి గల కారణాలను, పడిన కష్ట, నష్టాలను ఆమె వివరించారు. ఏపీలో కొడుకు వైఎస్ జగన్, తెలంగాణలో కూతురు షర్మిల పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారని, ఇటువంటి పరిస్థితుల్లో రెండు రాష్ట్రాల్లో వారివారి ప్రయోజనాలకు భంగం కలుగకుండా, వక్రీకరణకు, బురద చల్లె రాజకీయాలకు తావు లేకుండా ఉండేందుకు వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల తాను రాయని, చేయని సంతకంతో తాను రాజీనామా చేస్తున్నట్లు వైఎస్ జగన్కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజకీయం అంటే వక్రీకరణలు, దుష్ప్రచారాలు, వెన్నుపోట్లు కావని అన్నారు. అదేవిధంగా తన ఉనికి ఎవరికీ వివాదస్పదం కాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రజలు తనను క్షమించాలని కోరారు. తన అన్నకు ఏ కష్టం, ఇబ్బంది కలగకూడదనే తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టిందని, ఒంటరిగా పోరాడుతుందని ఆమెకు అండగా నిలిచేందుకు రాజీనామా నిర్ణయం తీసుకున్నానని వివరించారు.