YS Jagan | హైదరాబాద్ : ఏపీ సీఎం జగన్, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల రేపు (జూలై 8న) ఇడుపులపాయకు వెళ్లనున్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఆయన సమాధి వద్ద నివాళులు అర్పించనున్నారు. ఈ మేరకు ఇద్దరి పర్యటనకు సంబంధించిన వివరాలు వెలువడ్డాయి. గతంలో వీరిద్దరూ కలిసే నివాళులర్పించినప్పటికీ.. ఈసారి మాత్రం వేర్వేరుగా ఇడుపులపాయకు రానున్నారు. ఇప్పటికే ఇడుపులపాయకు చేరుకున్న షర్మిల రాత్రి అక్కడే బస చేయనున్నారు. మరుసటి రోజు ఉదయం తల్లి విజయమ్మతో కలిసి నివాళులర్పించి హైదరాబాద్ తిరుగు ప్రయాణం కానున్నారు. ఇక ఏపీ సీఎం జగన్ మధ్యాహ్నం 1.55 గంటలకు ఇడుపులపాయకు చేరుకుని నివాళులర్పిస్తారు.
వైఎస్ జయంతి, వర్ధంతి సమయంలో కుటుంబ సభ్యులంతా కలిసి ఇడుపులపాయకు చేరుకుని నివాళులర్పించడం ఆనవాయితీగా వస్తోంది. జగన్, షర్మిల మధ్య విభేదాలు తలెత్తిన తర్వాత కూడా ఇద్దరూ ఒకే సమయంలో ప్రార్థనల్లో పాల్గొనేవారు. గత ఏడాది ఇద్దరూ ముభావంగా ఉన్నప్పటికీ.. తల్లితో కలిసి వైఎస్ ఘాట్కు వచ్చారు. ఈసారి తండ్రి జయంతి రోజున ఉదయం కాకుండా ..మధ్యాహ్నం జగన్ ఇడుపులపాయకు చేరుకుంటున్నారు. షర్మిలను చూడటం ఇష్టం లేకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక కుటుంబ సభ్యులతో కలిసి తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొనే జగన్ మేనమామ, ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి ఈసారి విదేశీ పర్యటనలో ఉన్నారు. అలాగే షర్మిలకు సంబంధించి ఒక వార్త విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. వైఎస్సార్ సమాధి వద్ద ప్రార్థనల్లో పాల్గొన్న అనంతరం షర్మిల తన రాజకీయ భవిష్యత్తుపై ప్రకటన చేస్తారనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని వైఎస్సార్ తెలంగాణ పార్టీని విలీనం చేయనున్నారనే ప్రచారం కొంతకాలంగా నడుస్తోంది. ఈ ప్రచారానికి షర్మిల శనివారం తెరదించే అవకాశాలున్నాయని సమాచారం.