YS Jagan | వైసీపీ ఐదేళ్ల పాలనలో రూ.5లక్షల కోట్లు దోచేశారని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ ఒక్కడే రూ.2 లక్షల కోట్లను స్వాహా చేశారని విమర్శించారు. రాష్ట్రంలో ఎటు చూసినా వారు చేసిన అక్రమాలు, కబ్జాలు అనేకం వెలుగులోకి వచ్చాయని అన్నారు. వాటి నుంచి ప్రజలను మర్చలేందుకే వైసీపీ నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి సున్నా అని.. త్వరలోనే వైసీపీ కూడా అదే స్థితికి రాబోతుందని ఆదినారాయణ రెడ్డి విమర్శించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహా వైసీపీకి చెందిన నాయకులు అనేక మంది వైసీపీ నేతలంతా జైలుకు వెళ్లడం ఖాయమని హెచ్చరించారు. దస్త్రాల దహనం, కాల్వలో పారేయడం వంటి వారి దుశ్చర్యలకు నిదర్శనాలుగా అభివర్ణించారు.
జగన్ పాలనలో జరిగిన మద్యం విక్రయాల్లోనే భారీ కుంభకోణం బయటపడుతుందని తెలిపారు. వైసీపీకి రాజకీయాలు లేకుండా చేస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారనే భయంతోనే మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం కల్పించారని ఆరోపించారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో కబ్జాలు, తప్పులు జరగని ప్రాంతం ఏదీ లేదని విమర్శించారు.