YS Jagan | ఏపీలో 108 సేవలపై జరుగుతున్న నిర్లక్ష్యాన్ని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఎండగట్టారు. ప్రజల ప్రాణాలకు భరోసా ఇచ్చే 108 సర్వీసులకు చంద్రబాబు సర్కార్ ఉరివేస్తోందని మండిపడ్డారు. కుయ్.. కుయ్.. మూగబోతోంది.. ప్రజల ప్రాణాలు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
పాడేరు సమీపంలోని ముల్లుమెట్టకు చెందిన నిండు గర్భిణీని ఆస్పత్రికి తరలించేందుకు 108 రాకపోవడంతో ఆటోను ఆశ్రయించాల్సి వచ్చిందని వైఎస్ జగన్ తెలిపారు. చివరకు ఆటోలోనే ప్రసవం జరిగిందని.. వైద్యం అందక ఆటోలోనే శిశువు మరణించిందని పేర్కొన్నారు. వైసీపీ హయాంలో పట్టణ ప్రాంతాల్లో ఫోన్చేసిన 15 నిమిషాల్లోగా 108 అంబులెన్స్ రావాలన్న నిబంధన ఉంటే, దాన్ని అధిగమిస్తూ 12-14 నిమిషాల్లోనే చేరుకునేవని గుర్తుచేశారు. గ్రామీణ ప్రాంతాల్లో 20 నిమిషాల్లో చేరుకోవాలని నిబంధన ఉంటే, 16-17 నిమిషాల్లోనూ.. గిరిజన ప్రాంతాల్లో 30 నిమిషాల్లో చేరుకోవాలని నిబంధన ఉంటే, దీన్నికూడా అధిగమిస్తూ 22.12 నిమిషాల్లోనే చేరుకుని 108లు సేవలందించాయని తెలిపారు. మరి ఎందుకు ఇప్పుడు చేరుకోవడంలేదని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఫోన్ చేసినా ఎందుకు రావడంలేదని నిలదీశారు. ప్రభుత్వం అన్నది పనిచేస్తేనేకదా.. అంబులెన్స్లు వచ్చేవని అన్నారు. కలెక్షన్ల మీద తప్ప ప్రజలమీద ధ్యాస ఉంటేనే కదా అని దుయ్యబట్టారు.