అమరావతి : కరెంట్ ఛార్జీల పెంపుపై వైసీపీ ( YCP ) పోరుబాటను నిర్వహించింది. చంద్రబాబు నాయకత్వం లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే భారీగా విద్యుత్ ఛార్జీలు (Current charges ) పెంచిందని ఆరోపిస్తు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను నిర్వహించింది. రాష్ట్రప్రజలపై రూ. 15 వేల కోట్ల అదనపు భారం మోపిందని ఆరోపించింది. ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
నగరిలో మాజీ మంత్రి రోజా (Roja) నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. బాబు ష్యురిటీ.. బాదుడు గ్యారంటీ అన్నట్లుగా చంద్రబాబు పాలన ఉందని విమర్శించారు. ఓటేసిన ప్రజలను చంద్రబాబు ప్రభుత్వం కాటేస్తుందని ఆరోపించారు.
చిత్తూరు జిల్లా కేంద్రంలో నిర్వహించిన నిరసనలో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి (MP Mithun reddy ) మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యుత్ బిల్లుల పేరుతో ప్రజలను దోపిడీ చేస్తున్నారని, ఎన్నికలకు ముందు మాటలకు ఇప్పటి చేతలకు సంబంధం లేదని పేర్కొన్నారు. అమరావతికి లక్ష కోట్లు ఖర్చు చేస్తే మిగతా ప్రాంతాల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి మాట్లాడుతూ గతంలో విద్యుత్ బిల్లులు తగ్గించాలని రైతులు డిమాండ్ చేస్తే వారిపై కాల్పులు జరిపిన ఘనుడు చంద్రబాబు అన్ని ఆరోపించారు.