అమరావతి : పెట్రోల్, డీజిల్ కొరతపై ఏపీలో వైసీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం నిరసనలు (YCP Protests ) తెలిపారు. పెట్రోల్ ( Petroll ) , డీజిల్ ( Diesel ) దొరక్క వాహనదారులు, రైతులు అల్లాడుతుంటే కనీసం కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ రోడ్లపై నిరసనలు తెలిపారు. కూటమి ప్రభుత్వం అసమర్థతని నిలదీస్తూ ఛలో పెట్రోల్ బంక్కార్యక్రమాలను నిర్వహించింది.
తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అసమర్థతని ప్రశ్నిస్తూ ఎడ్ల బండితో నిరసన తెలిపారు. బంకులతో కూటమి నేతలు లాలూచి పడ్డారని ఆరోపించారు. బంక్ల వద్ద మూడు రోజుల నుంచి ఇంధనం కోసం బారులు తీరినా చీమకుట్టినట్లయినా ప్రభుత్వానికి లేదని విమర్శించారు.
కాగా వైసీపీ ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న పెట్రోల్, డీజిల్ సంక్షోభంపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. రాష్ట్రంలో బంక్ యజమానులతో కూటమి నేతలు కుమ్మక్కై కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు. అన్నిచోట్లా బంకుల వద్ద ‘ నో స్టాక్’ బోర్డులు వెలిశాయని కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని, రాష్ట్రంలో ఇంధన సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.