అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులకు సంఘీభావంగా రేపు వైసీపీ పార్లమెంట్ సభ్యుడు రఘురామరాజు ఒక రోజు దీక్షను చేపట్టనున్నారు. ఏపీ ప్రభుత్వం రివర్స్ పీఆర్సీని ప్రకటించి ఉద్యోగుల మనోభావాలను దెబ్బతీసిందని వైసీపీ ఎంపీ రఘురామరాజు ఆరోపించారు. రేపు(బుధవారం) ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఢిల్లీలోని తన ఇంట్లో దీక్షను చేపట్టనున్నట్లు ప్రకటించారు.
ఈరోజు ఢిల్లీలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉద్యోగులకు పీఆర్సీని ప్రకటించి సంతోషంలో ముంచెత్తారని అయితే నిన్న విడుదల చేసిన జీవోలో ఉద్యోగులకు అన్ని వ్యతిరేక నిర్ణయాలే ఉన్నాయని ఆరోపించారు. ఉద్యోగులకు రివర్స్ పీఆర్సీని జగనన్న కానుకగా ఇచ్చారని విమర్శించారు.
ఈ జీవోలపై ఉద్యోగ సంఘాలన్నీ అసంతృప్తిగా ఉన్నాయని, ఇలాంటి కోతలు చరిత్రలో ఎప్పుడూ చూడలేదని ఆయన వ్యాఖ్యనించారు . రాష్ట్ర ఉద్యోగులకు సంఘీభావంగా రేపు దీక్ష చేపట్టనున్నట్లు రఘురామ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు కూడా ఉద్యోగులకు సంఘీభావం తెలుపాలని ఆయన కోరారు.