రాజకీయాల్లో వున్నంత కాలం తాను జగన్మోహన్ రెడ్డితోనే వుంటానని ఏపీ మాజీ మంత్రి, వైసీసీ ఎమ్మెల్యే మేకతోటి సుచరిత స్పష్టం చేశారు. 2009 నుంచి తాను జగన్ వెంబడే నడిచానని, ఎప్పటికీ తనతోనే నడుస్తానని తెలిపారు. ఎట్టకేలకు మాజీ మంత్రి మేకతోటి సుచరిత ఏపీ సీఎం జగన్తో భేటీ అయ్యారు. దాదాపు గంటన్నర పాటు వీరిద్దరి భేటీ సాగింది. సీఎం జగన్తో భేటీ ముగిసి తర్వాత ఆమె విలేకరులతో మాట్లాడారు. పార్టీ ఆదేశాలకు అనుగుణంగానే తాను నడుచుకుంటానని, 2024 లో పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పనిచేస్తామని ప్రకటించారు.
కొంత మందిని కేబినెట్ నుంచి తీయాల్సి వస్తుందని, వారికి పార్టీ బాధ్యతలు అప్పజెప్పాల్సి వస్తుందని సీఎం జగన్ గతంలోనే చెప్పారని, చివరి కేబినెట్ సమావేశంలోనూ చెప్పారని ఆమె అన్నారు. దానికి కట్టుబడే ఉన్నానని ఆమె స్పష్టం చేశారు. తాను జగన్ కుటుంబ సభ్యురాలినేనని, అయితే తాను చిన్న ఎమోషన్ కి మాత్రం గురయ్యానని పేర్కొన్నారు.
తాను రాసింది రాజీనామా లెటర్ కాదని, అది కృతజ్ఞతను ఆవిష్కరించే లెటర్ అని సుచరిత తెలిపారు. కానీ కొందరు దానిని రాజీనామా లెటర్ అంటూ తప్పుడు ప్రచారం చేశారని అన్నారు. తన కూతురు పొరపాటున ఏదో మాట్లాడిందని, చిన్న పిల్ల మాటలను ఇంత రాద్ధాంతం చేయడమేంటని అసహనం వ్యక్తం చేశారు. ఇక ఈ అధ్యాయానికి స్వస్తి పలకాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
ఏపీ నూతన కేబినెట్లో తనకు మంత్రి పదవి దక్కలేదని హొంశాఖ మాజీ మంత్రి సుచరిత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆమె అనుచరులు తీవ్ర ఆందోళనలు చేశారు. ఎమ్మెల్యే పదవికి సుచరిత రాజీనామా చేసినట్లు వార్తలు కూడా వచ్చాయి. దీంతో ఆమెను బుజ్జగించాలని వైసీపీ ఎంపీ మోపిదేవి వెంకట రమణకు బాధ్యతలు అప్పజెప్పారు. దీంతో మోపిదేవి ఆమెతో వరుసగా సమావేశాలు జరిపారు. ఎక్కడా సుచరిత మెత్తబడలేదు. ఆ తర్వాత సీఎం జగన్ అపాయింట్మెంట్ కోసం సుచరిత చాలా ప్రయత్నాలు చేశారు. సీఎం జగన్ నిరాకరిస్తూ వచ్చారు. చివరికి నేడు సీఎం జగన్ ఆమెతో భేటీ అయ్యారు. ఈ భేటీ తర్వాత సుచరిత అలక వీడారు.